సోషల్ వీరులపై జగన్ సర్కార్ నజర్- సీఐడీ వరుస కేసులతో బెంబేలు.. త్వరలో అరెస్టులు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం శృతి మించుతోంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రోజువారీ నిర్ణయాలను కూడా విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక ఎవరున్నారనే అంశంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు ఇప్పటికే ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వీరు సమాజంలో విభిన్న వృత్తుల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు కావడంతో ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే సాగుతోందన్న అంచనాకు సీఐడీ వచ్చింది.
సోషల్ మీడియాలో విష ప్రచారం...
ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వారిని కట్టడిచేసేందుకు సీఐడీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవాడలో పోలీసు హౌసింగ్ కార్పోరేషన్లో డీఈఈగా పనిచేస్తున్న విద్యాసాగర్, గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త రంగనాయకమ్మ, ఆమెకు సహకరించిన హైదరాబాద్ వాసి మల్లాడి రఘునాథ్, ప్రకాశం జిల్లాకు చెందిన పాండిచ్చేరి జిప్మర్ ఫార్మసీ ఉద్యోగి పవన్ కుమార్, నెల్లూరుకు చెందిన సత్యంరెడ్డి ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని ఆదేశాలు ఇచ్చింది. విద్యాసాగర్, రంగనాయకమ్మ, పవన్ విచారణకు హాజరుకాగా.. మిగిలిన వారిని త్వరలో ప్రశ్నించనున్నారు.
తీగ లాగితే డొంక కదులుతోందా ?
ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని విచారిస్తున్న నేపథ్యంలో సీఐడీ అధికారులకు ఓ క్లూ దొరికింది. నిందితులు షేర్ చేస్తున్న పోస్టులన్నీ వీరు సృష్టిస్తున్నవి కాదు. ఎవరో తయారు చేస్తున్న పోస్టులను వీరు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని తెలిసింది. దీంతో ఇలా పోస్టులు తయారు చేస్తున్న వారిలో ఒకరైన హైదరాబాద్ వాసి మల్లాది రఘునాథ్ ను గుర్తించి 41ఏ కింద విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. రఘునాథ్ విచారణ తర్వాత ఈ పోస్టులు ఎక్కడి నుంచి ఎవరెవరికి షేర్ చేస్తున్నారనే అంశంపై సీఐడీ అధికారులు ఓ క్లారిటీకి రానున్నారు.
త్వరలో కొందరి అరెస్టులు...
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వారంతా ప్రజాభిప్రాయాన్ని షేర్ చేస్తున్నామనే చెప్తున్నారు. దీంతో వీరిని ఐటీ చట్టాల కింద శిక్షలు, జరిమానాలు విధించే అంశాన్ని సీఐడీ పరిశీలిస్తోంది. ఇప్పటికే సేకరించిన కొన్ని ఐటీ అడ్రస్ లు, ఇతర ఆధారాలతో పాటు మరికొన్ని సాక్ష్యాలను తీసుకున్నాక వీరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. వ్యక్తులను కానీ, వ్యవస్దలను కానీ కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించడం ఐటీ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేస్తున్న సీఐడీ అధికారులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
కొందరిపై చర్యలు- మరెందరికో హెచ్చరికలు..
సోషల్ మీడియా పోస్టులతో ప్రభుత్వాన్ని కించపరుస్తున్న వారిపై ఐటీ చట్టాన్ని ప్రయోగించడం ద్వారా ఇదే బాటలో మరెందరికో హెచ్చరికలు పంపాలని సీఐడీ భావిస్తోంది. విష ప్రచారంపై ఇప్పటికే స్పందించిన సీఐడీ డీఎస్పీ సరిత.. సోషల్ ప్రచారానికి దూరంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాన్ని కించ పరుస్తూ చేసే ప్రచారంపై రాజద్రోహంతో పాటు మరికొన్ని తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు రాజ్యాంగం వీలు కల్పిస్తుందని, అవసరమైతే వీరిపై పలు సెక్షన్లను ప్రయోగించక తప్పదని అధికారులు చెప్తున్నారు.