పొలిటికల్లీ సెన్సిటివ్: ఆ మూడు మున్సిపాలిటీలపై వైఎస్ జగన్ నజర్: స్పెషలాఫీసర్గా: ఎందుకు..?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మూడు మున్సిపాలిటీల స్థితిగతులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారిని నియమించారు. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు ఉండగా.. ఈ మూడింటిపైనే జగన్ సర్కార్ తన దృష్టికి కేంద్రీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మూడింట్లో ఒక మున్సిపాలిటీలని పక్కన పెడితే..మిగిలిన రెండూ రాజకీయంగా సమస్యాత్మకమైనవే.
ఆ ఉద్యోగులపై ఏపీ సర్కార్ రివర్స్ అస్త్రం ... జీతాలు తిరిగి ఇవ్వాలంటూ
పులివెందుల సహా..
కడప జిల్లాలోని పులివెందుల సహా గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలపై జగన్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారిని నియమించింది. మున్సిపల్ శాఖ కమిషనర్ జీ ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ను ప్రత్యేక అధికారిగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామలరావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు..
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. కొద్ది రోజుల కిందటే ఈ నియోజకవర్గంపై ఆయన వరాల జల్లు కురిపించారు. 1350 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిందటి నెలలో కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన సందర్భంగా పులివెందులలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నిధుల కేటాయింపు భారీగా ఉండటం, సొంత నియోజకవర్గం కావడంతో శంకుస్థాపన చేసిన పనులు వేగవంతం చేయడానికే ప్రత్యేకాధికారిని నియమించినట్లు తెలుస్తోంది.
మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో..
పులివెందులతో పోల్చుకుంటే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు రాజకీయంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమస్యాత్మకమైనవిగా చెప్పుకోవచ్చు. అమరావతి గ్రామాలను ఆనుకుని ఉండటం వల్ల మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ ప్రకంపనలు ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల అమరావతి గ్రామాల రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
పెరిగిన పరిధి..
తాడేపల్లి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి విస్తృతమైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని ప్రాతూరు, వడ్డేశ్వరం, పెనుమాక, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమేడ, ఉండవల్లి పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసింది ప్రభుత్వం. అలాగే- ఆత్మకూరు, నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, చినకాకాని గ్రామాలను మంగళగిరిలోకి విలీనం చేసింది. వాటి పరిధి పెరిగినందు వల్ల బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అంటున్నారు.