Sarileru Neekevvaru: మహేష్బాబు అభిమానులకు జగన్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్: ఇక పండగే..!
అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు అభిమానులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ మాంఛి బహుమతిని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహేష్బాబు అభిమానులు ఇక పండగ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి విడుదల కాబోతోన్నసరిలేరు నీకెవ్వరుకు రెండు అదనపు షోలను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
వారంరోజుల పాటు అదనపు షోలు..
సినిమా విడుదల కానున్న 11వ తేదీ నుంచి వారం రోజుల పాటు..అంటే 17వ తేదీ వరకు ఈ రెండు అదనపు షోలను ప్రదర్శించే వెసలుబాటును కల్పించింది థియేటర్ల యాజమాన్యానికి. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నుంచి వరుసగా ఉదయం 10 గంటల వరకు ఈ రెండు షోలను ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.
రోజూ ఆరు ఆటలు..
రాష్ట్రంలో సరిలేరు నీకెవ్వరు సినిమాను ప్రదర్శించే సాధారణ స్థాయి థియేటర్లు మొదలుకుని మల్టీప్లెక్స్లకు వరకు అన్ని రకాల సినిమా హాళ్లకు ఈ ఉత్తర్వులను వర్తింపజేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను ఇచ్చారు. అర్ధరాత్రి పూట సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుందని, దీనితో పాటు వందలాది మంది అభిమానులు ఒకేచోట గుమికూడుతారని పేర్కొంది. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని సినిమా థియేటర్ల వద్ద పోలీసు భద్రతను కల్పించాల్సి ఉంటుందని సూచించింది.
అగ్రహీరోలు నటించిన మూవీలకు..
టాప్హీరోలు నటించిన సినిమాలకు అదనపు షోలను ప్రదర్శించుకోవడానికి థియేటర్ల యాజమాన్యానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారేమీ కాదు. ఇదివరకు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలు నటించిన సినిమాలకు అదనపు షోలను వేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనుమతులు మంజూరైన విషయం తెలిసిందే. అదే ఆనవాయితీని ప్రభుత్వం కొనసాగించింది. మహేష్బాబు సినిమాకూ అనుమతిని ఇచ్చింది.
ఆకాశానికి హైప్..
సూపర్ స్టార్ మహేష్బాబు, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్బాబు సైనికాధికారి పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్లో మహేష్బాబు నటించడం ఇదే తొలిసారి. చాలాకాలం తరువాత విజయశాంతి ఈ మూవీలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 11వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ మూవీ విడుదల కానుంది. సుమారు వెయ్యి స్క్రీన్లలో దీన్ని ప్రదర్శించనున్నారు.