నటుడి కుటుంబానికి రూ.5 లక్షలిచ్చాం: చినరాజప్ప
హైదరాబాద్: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన సినీ నృత్య దర్శకుడు విజయ్ సింగ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం తెలిపారు.
ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారి ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు ఎప్పటికి అప్పుడు సంప్రదిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 93 మందిని రాష్ట్రానికి సురక్షితంగా తీసుకు వచ్చామని చెప్పారు.
కాగా, నేపాల్ భూకంపం దుర్ఘటనలో 'ఎటకారం' చిత్ర నృత్యదర్శకుడు, నటుడు కావిట్య విజయ్ సింగ్(20) మృతి చెందిన సంగతి తెలిసిందే. నేపాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనల ధాటికి ఎటకారం చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయ్ మృతదేహం బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
అనంతరం మృతదేహాన్ని విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లకు తరలించారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో మార్కెట్ ప్రాంతానికి చెందిన విజయ్ సింగ్కు చిన్నతనం నుంచి నృత్యం అంటే చాలా ఇష్టం. సినీ నటుడు ప్రభుదేవాను స్ఫూర్తిగా తీసుకుని నృత్యాలు నేర్చుకొని గత ఐదారేళ్లుగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.
'ఎటకారం' సినిమాను విజయ్ సింగ్ బాబాయ్ కిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నృత్య దర్శకుడిగా పని చేసే అవకాశం లభించించడంతో ఈ నెల 20న చిత్రీకరణ కోసం చిత్ర బృందంతో కలిసివిజయ్ నేపాల్ వెళ్లాడు. శనివారం ఉదయం నేపాల్లో భూకంపం సంభవించగానే ఆందోళనకు గురైన తల్లితండ్రులు విజయ్తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సిగ్నల్ అందకపోవడంతో మాట్లాడలేకపోయారు.
హైదరాబాద్లో ఉన్న సినిమా నిర్మాతకి ఫోన్ చేయగా అందరు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. కుమారుడు క్షేమంగా ఉన్నారని తల్లిదండ్రులు వూపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో ఖాట్మాండు నుంచి విజయ్ మాట్లాడాడు.... బయపడవద్దని వచ్చేస్తున్నానని ధైర్యం చెప్పాడు.
తర్వాత పలుమార్లు విజయ్ ఫోన్ కలవలేదు. సోమవారం తెల్లవారుజామున దిల్లీకి బయలు దేరిన సమయంలో వచ్చిన భూప్రకంపనలకు చిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విజయ్సింగ్ చనిపోయినట్లు బాపట్లలో ఉన్న అతని తల్లిదండ్రులకు నిర్మాత కిషన్ ఈ రోజు ఉదయం 5గంటలకు సమాచారం అందించారు.