ఎపి:నిరుద్యోగులకు శుభవార్త...గ్రూప్ 1, గ్రూప్ 2లతో సహా 20 వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు
అమరావతి:రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసులు, డీఎస్సీ, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల్లోని సుమారు 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వివిధ ప్రభుత్వం శాఖలలో ప్రస్తుతం భారీగా ఉన్న ఖాళీలు, వాటిని త్వరగా భర్తీ చేయాల్సిన ఆవశ్యకత దృష్ట్యా ఈ మెగా రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పోస్టుల వివరాలు: గ్రూప్-1 : 150 ఖాళీలు; గ్రూప్-2 : 250 ఖాళీలు; గ్రూప్-3 : 1,670 ఖాళీలు; డీఎస్సీ ద్వారా : 9,275 ఖాళీలు; పోలీస్ ఎగ్జిక్యూటివ్; పీఎస్ఎల్పీఆర్బీ : 3,000 ఖాళీలు; వైద్య శాఖల్లో : 1,604 ఖాళీలు; ఇతర శాఖల్లో : 1,636 ఖాళీలు. ఇప్పటివరకు వీటికి ఆమోదముద్ర లభించింది.
అయితే ముందుగా గుర్తించిన ఖాళీల ప్రకారం చూస్తే రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో సుమారు 46,290 ఉద్యోగాలు భర్తీకి ఆస్కారం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో ఫిల్ చేయనున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. అయితే తొలివిడతాగా సిఎం చంద్రబాబు 20,010 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపగా వీలువెంబడి మిగతా పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.