సీఎం జగన్,మంత్రులకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... రూ.6.75కోట్లతో కొనుగోలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,కేబినెట్ మంత్రులు,రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు త్వరలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రానున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల సలహా మేరకు 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 6.75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం(మార్చి 3) ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video
మొత్తం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఐదు స్కార్పియోలు, మరో ఐదు టాటా హెక్సా వాహనాలు ఉండనున్నాయి. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కోసం రూ.65లక్షలు,ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ టాటా హెక్సా వాహనాల కోసం రూ.70లక్షలు చొప్పున ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాలతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పాత వాహనంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఓ మంత్రి అనారోగ్యానికి కూడా గురయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రుల ఫిర్యాదులు,పోలీస్ ఉన్నతాధికారుల సలహాలతో పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఓకె చెప్పింది. వీటిని ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల భద్రత కోసం వినియోగించనున్నారు.
ఇదిలా ఉంటే,గురువారం(మార్చి 4) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అవుతారన్న చర్చ జరుగుతోంది. అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. నిజానికి గురువారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు అమిత్షా హాజరు కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో అమిత్ షా ఆ పర్యటన రద్దు చేసుకోవడంతో సీఎం జగనే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనపై ఇంకా అధికారిక వివరాలు వెలువడలేదు.