ఆలయ టికెట్ల గోల్మాల్ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ: లక్షల రూపాయలు చేతులు మారడంపై నిఘా
కర్నూలు: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో చోటు చేసుకున్న టికెట్ల గోల్మాల్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా- ఈ కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి బదలాయించింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఓ సర్కులర్ను జారీ చేశారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.
శ్రీశైలం ఆలయంలో స్వామివారి దర్శనం టిక్కెట్లను జారీ చేయడంలో, ఆన్లైన్ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల్లో చోటు చేసుకున్న అక్రమాల కేసును ఏసీబీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి, మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించారు. ఫలితంగా- మంగళవారమే ఏసీబీ అధికారులు ఈ కేసును తాము స్వాధీనం చేసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా శ్రీశైలం వెళ్లనున్నారు.
2016-17 సంవత్సరంలో శ్రీశైలం దేవస్థానంలో ఆలయ టిక్కెట్ల విక్రయాలు, విరాళాల్లో 2.52 కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్న విషయం కొద్దిరోజుల కిందటే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నలుగురు సహాయ కార్యనిర్వహణాధికారులు, ముగ్గురు ఇన్చార్జీలతో పాటు కిందిస్థాయి సిబ్బందిని అరెస్టు చేశారు.
ఇసుక కొట్టేస్తే నో సీఐడీ..మహిళలను వేధిస్తోంటే నో సీఐడీ: బాలయ్య డైలాగులను పేల్చిన నారా లోకేష్
Recommended Video
నిందితులు నాలుగు నకిలీ ఐడీలను క్రియేట్ చేసి.. వాటి ద్వారా అభిషేకం, ఆర్జిత సేవల టికెట్లను విక్రయించారు. నకిలీ ఐడీ కావడం వల్ల భక్తులు టికెట్లను కొనుగోలు చేయడానికి చెల్లించిన డబ్బులు శ్రీశైలం దేవస్థానం ఖాతాలోకి చేరలేదు. 150 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు, 1500 అభిషేకం టికెట్లను కూడా నిందితులు మాయం చేశారని తేలింది. టోల్గేట్, పెట్రోల్ బంకుల నిర్వహణ, 500 రూపాయల టిక్కెట్ల జారీ, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లను జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వడం పట్ల మరింత లోతుకు దర్యాప్తు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.