అనుమతి లేని బోటులో రాష్ట్రపతి సతీమణి విహారానికి ఏర్పాట్లు...మరో వివాదంలో ఎపి ప్రభుత్వం
విజయవాడ: పాత తప్పుల నుంచి ఎపి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదా...లేకపోతే ఎవరేమనుకుంటే మాకేంటి అనుకుంటోందా...లేక అంతులేని నిర్లక్ష్యమా...కారణం ఏంటో తెలియదు కానీ అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాల్లో సైతం ఎపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించడం వివాదాలకు దారితీస్తోంది. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతుల ఎపి పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది.
రాష్ట్రపతి దంపతులు బుధవారం ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి పవిత్ర సంగమ సమీపంలోని భవానీ ద్వీపాన్ని సందర్శించేందుకు ఎపి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే వారిని పున్నమిఘాట్ నుంచి ప్రైవేటు బోటులో భవాని ద్వీపానికి తీసుకెళ్లడం వివాదాస్పదం అయింది.
ఈ బోటులోనా...
ఇటీవలే పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా నదిలో ప్రైవేటు బోట్లన్నింటినీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వం బుధవారం రాష్ట్రపతి కుటుంబ సభ్యులను భవాని ద్వీపం పర్యటనకు ప్రైవేటు బోటులో తరలించడం అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అసలు ఈ బోటులో పర్యాటకులకు కనీసం ఎండ నుంచి రక్షణ లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఏకంగా రాష్ట్రపతి కుటుంబ సభ్యులనే ఇలా తరలించడం పై సర్వత్రా చర్చనీయాంశం అయింది.
రిటర్న్ జర్నీ...
ఒకవేళ భద్రతా దృష్ట్యా ఈ బోటులో తీసుకెళ్లామని ఎపి ప్రభుత్వం సమర్థించుకుందామని చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రపతి కుటుంబ సభ్యులను భవాని ద్వీపం నుంచి తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ శాఖ బోటు ‘బోధిసిరి'ని వినియోగించారు. దీంతో తాము తప్పు చేసినట్లు ఎపి ప్రభుత్వమే అంగీకరించినట్లయింది. అసలు ముందే భవానీ ద్వీపానికి తీసుకెళ్లేటప్పుడే పర్యాటక శాఖ బోటును ఉపయోగించి ఉంటే బాగుండేదని అందరూ అభిప్రాయపడ్డారు.
నిర్లక్ష్యమా... లెక్కలేనితనమా...
దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కుటుంబ సభ్యుల విషయంలోనే ఎపి ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఇబ్బందికరమైన అంశమే. ఇంత ముఖ్యమైన పర్యటన విషయంలో ఈ విధమైన తప్పిదాలు ఖచ్చితంగా ఎపి ప్రభుత్వం ప్రతిష్టను దేశవ్యాప్తంగా దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ తప్పిదం విషయంలోను నిర్లక్షమా లేక లెక్కలేనితనమా అనేది జవాబివ్వక తప్పని పరిస్థితి వస్తుందంటున్నారు పరిశీలకులు.