నిమ్మగడ్డ టూర్ ఎఫెక్ట్?: టీటీడీ జేఈఓపై బదిలీ వేటు: నో పోస్టింగ్: జీఏడిలో రిపోర్ట్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పీ బసంత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆ పదవి నుంచి ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచయాతీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిశీలకుడిగా వ్యవహరిస్తోన్న ఆయనను కొనసాగించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఆయనను పరిశీలకుడిగా ఉంటారని పేర్కొంది.
2007 బ్యాచ్, ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి బసంత్ కుమార్కు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా గుర్తింపు ఉంది. ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేయడంపై జిల్లాలో పలు ఊహాగానాలు చెలరేగుతోన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్- ప్రభుత్వం మధ్య సాగుతోన్న వివాదాల నేపథ్యంలోనే ఆయన బదిలీ అయ్యారనే ప్రచారం సాగుతోంది. తన చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తిరుమలలోో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బసంత్ కుమార్.. నిమ్మగడ్డ వెంటే ఉన్నారని చెబుతున్నారు. దీన్ని ప్రొటోకాల్ ఉల్లంఘనగా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం, తీర్థ ప్రసాదాలను అందజేయడం.. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల విధి. వీవీఐపీలు సందర్శించిన సమయంలో కార్యనిర్వహణాధికారి, సాధారణ సందర్భాల్లో ఇతర అధికారులు ప్రొటోకాల్ ప్రకారం.. ఆహ్వానం పలుకుతుంటారు. దీనికి భిన్నంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో బసంత్ కుమార్ ఆయన వెంట ఉన్నారని, అదే ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైందనే అభిప్రాయాలు జిల్లాలో వినిపిస్తున్నాయి.