ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వస్తారా : చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం : ఉద్యోగ సంఘాలు మాత్రం..!!
ఏపీ ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం వర్తమానం పంపింది. ఏపీలో పీఆర్సీ వివాదం పైన సమ్మె బాటకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్దమైంది. తాజా జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల అపోహలను తొలిగించేందుకె..వారితో చర్చల కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మంత్రుల కమిటీ చర్చలకు రావాలంటూ ఆహ్వానించినా..తొలి రోజు హాజరు కాని ఉద్యోగ సంఘాలు అదే రోజున తమ సమ్మె నోటీసు ఇచ్చాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించాయి.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తారా
అయితే, వీరికి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెలో పాల్గంటారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఎన్ఎంయూ నేతలు చెబుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ సంఘ నేతలు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులంతా భావిస్తే, వారితో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐఆర్ తేడా ఉందని తెలిపారు. గతంలో నాలుగేళ్లకోసారి ఆర్టీసీలో వేతన సవరణ ఉండేదని, ఇప్పుడు మాత్రం పదేళ్లకోసారి అంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం నుంచి మరోసారి ఆహ్వానం
2020 జనవరిలో ప్రభుత్వంలో విలీనమై పీటీడీ ఉద్యోగులుగా మారిన యాభై వేల మంది ఉమ్మడి పోరులో భాగస్వాములయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఎంప్లాయిస్ యూనియన్.. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇప్పటికే ఉద్యోగుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఇక, ఇప్పటికే ప్రభుత్వం నుంచి రెండు సార్లు చర్చలకు ఆహ్వానం అందుకున్న ఉద్యోగ సంఘాలు రెండో విడత తమ ప్రతినిధులను మంత్రుల వద్దకు పంపారు. వారితో ఒక లేఖ కూడా అందించారు. అందులో మూడు డిమాండ్లు ప్రధానంగా ప్రస్తావించారు.
ఉద్యోగ నేతలు మాత్రం ఆ డిమాండ్ల పైనే
ఇప్పటికే జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. పాత వేతనాలే చెల్లించాలని డిమాండ్ చేసారు. కొత్త పీఆర్సీ పైన మరోసారి చర్చలకు పిలవాలనేది ఉద్యోగ సంఘల డిమాండ్. అయితే, ప్రభుత్వం నుంచి వీటి పైన ఎటువంటి హామ అందలేదు. ఇదే సమయంలో మరోసారి ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ మధ్నాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ పిలుపు వచ్చింది. పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని .....స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులనుసాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆహ్వానించారు.
ప్రభుత్వం ఏం చేయనుంది..
మంత్రుల కమిటీ ముందు పెట్టిన మూడు డిమాండ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే చర్చలకు వెళ్తామని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నేతలు తేల్చిచెబుతున్నారు. అయినా.. మంత్రులు మాత్రం గతంలో రెండు సందర్భాల్లోనూ సచివాలయంలోనే ఉద్యోగ సంఘాల నేతల కోసం నిరీక్షించారు. ఇక, ఈ రోజున ఉద్యోగ సంఘాల నేతల వైఖరి ఎలా ఉండనుంది.. మంత్రులు ఏం చేయబోతున్నారనే దాని పైన ఆసక్తి నెలకొని ఉంది.