వర్క్లోడ్: ఏపీలో మరో 1350 అంబులెన్సులు: ఆ పేషెంట్లకు ప్రత్యేకం: ప్రతి మండలంలో 2కు పైగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భయానకంగా పెరిగిపోతున్నాయి. 10 వేలకు పైగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..రాష్ట్రంలో కొత్తగా 10368 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,42,244కు చేరుకున్నాయి.
108పై పని భారాన్ని తగ్గించడానికి..
రోజవారీ పాజిటివ్ కేసుల్లో చాలావరకు గ్రామాలు, మధ్యస్థాయి పట్టణాల్లోనివే. ఆయా ప్రాంతాల్లో 108 అంబులెన్సులు సకాలంలో అందుబాటులో ఉండట్లేదని, పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పేషెంట్ను వెంటనే కోవిడ్ కేర్ సెంటర్కు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లోటును భర్తీ చేయడానికి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
కొత్తగా 1350 ప్రైవేటు అంబులెన్సులు..
రాష్ట్రంలో కొత్తగా 1350 ప్రైవేటు అంబులెన్సులను అందుబాటులోకి తీసుకుని రానుంది. అద్దె ప్రాతిపదికన వాటిని తమ ఆధీనంలోకి తీసుకోబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రారంభించిన 1060 కొత్త అంబులెన్సులకు అదనంగా 1350 ప్రైవేటు అంబులెన్సులు పేషెంట్లకు సేవలు అందిస్తాయి. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా వాటిని వినియోగిస్తారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ సోకిన పేషెంట్ను కోవిడ్ కేర్ సెంటర్కు తరలించడం లేదా మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేయడానికి ఈ ప్రైవేటు అంబులెన్సులను సేవలను వినియోగించుకోనుంది ప్రభుత్వం.
మండల కేంద్రంలో రెండు లేదా అంతకు మించి..
ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఒక్కో మండలాన్ని ఓ యూనిట్గా తీసుకోవాలని, అక్కడ కనీసం రెండు ప్రైవేటు అంబులెన్సులను తప్పనిసరిగా అద్దెకు తీసుకోవాలని, వాటిని అందుబాటులో ఉంచాలని సూచించింది. అవసరాన్ని బట్టి.. ఈ సంఖ్యను పెంచుకునే వెసలుబాటును కలెక్టర్లకు కల్పించింది. అవసరాన్ని బట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
రెఫరెల్ వ్యవస్థతో అనుసంధానం..
ఈ ప్రైవేటు అంబులెన్సులను 108, రెఫరెల్ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. దీనికోసం ప్రతి మండల కేంద్రంలో ఓ కాల్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థానిక ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఈ కాల్ సెంటర్ను నంబర్ను అందజేస్తారు. అవసరం ఏర్పడినప్పుడు ఆ కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే.. వెంటనే అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకుని వస్తారు. ఈ తరహా రెఫరెల్ వ్యవస్థను ప్రభుత్వం మండల స్థాయిలో అభివృద్ధి చేసింది.
Recommended Video
కోవిడ్ కోసం ప్రత్యేకంగా..
ప్రస్తుతం మండల కేంద్రాల్లో 108 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై పని భారం అధికమౌతోందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. సాధారణ ప్రమాదాలతో పాటు కోవిడ్ పరిస్థితుల వల్ల ఒకే సమయంలో అంబులెన్సుల కోసం ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రైవేటు అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. వాటిని ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్లకు మాత్రమే వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు.