ఏపీ స్ధానిక పోరుపై పార్టీలతో నేడు ఈసీ భేటీ- వైసీపీ డుమ్మా- అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్
ఏపీలో ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైసీపీ సర్కారు ఆగ్రహం చల్లారలేదు. ఆయన్ను ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ పదవి నుంచి తొలగించినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులతో ఆయన పదవిలో కొనసాగడాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం... ఇఫ్పుడు ఆయన ఆధ్వర్యంలో స్ధానిక ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్దంగా లేదు.
దీంతో ఆ విషయం నేరుగా చెప్పకుండా కరోనా వేళ ఎన్నికలేంటంటూ నిమ్మగడ్డకు రోజూ చురకలంటిస్తోంది. అంతటితో ఆగకుండా ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు నిధులు ఆపేయడంతో పాటు ఆయన రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన భేటీకి వెళ్లరాదని నిర్ణయించింది. అప్పటికీ ఆగకుండా అసలు ఈ భేటీ జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది.
నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సర్కార్...
ఏపీలో తమ అభీష్టానికి వ్యతిరేకంగా స్ధానిక ఎన్నికలను వాయిదా వేశారన్న కారణంతో పాటు ఆ తర్వాత చోటు చేసుకున్న పలు ఘటనలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆగ్రహంగా ఉన్న వైసీపీ సర్కారు తాను అనుకున్న విధంగానే ముందుకెళుతోంది. నిమ్మగడ్డతో ముఖాముఖీ పోరు నడిపాక ఇక ఎన్నికలకు వెళితే ఆయన నుంచి ఆశించిన సహకారం ఉండబోదని భావిస్తున్న ప్రభుత్వం ఆయన పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో స్ధానిక ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. తొలుత స్ధానిక ఎన్నికల నిర్వహణకు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం ఆ తర్వాత అసలు ఎన్నికల నిర్వహణకు ఏ విధంగా సహకరించకుండా అడ్డుకునేందుకు పావులు కదుపుతోంది. కానీ నిమ్మగడ్డ కూడా అంతే పట్టుదలగా ఉండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
స్ధానిక పోరుపై భేటీకి వైసీపీ డుమ్మా...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో నిర్వహించ తలపెట్టిన భేటీకి వెళ్లరాదని వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కూడా వైసీపీ అంతే స్పష్టంగా బయటపెట్టింది. గతంలో వైసీపీ విషయంలో నిమ్మగడ్డ వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉందని, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే తమకు న్యాయం జరగదని భావిస్తున్నట్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే నిమ్మగడ్డ ఉన్నంత వరకూ తాము ఎన్నికలు ఎదుర్కొనే సమస్యే లేదని వైసీపీ ఓ స్పష్టమైన ప్రకటన చేసినట్లయింది. తద్వారా నిమ్మగడ్డతో సాగుతున్న పరోక్ష యుద్ధాన్ని ఇప్పుడు వైసీపీ ప్రత్యక్ష యుద్ధంగానే మార్చినట్లు అర్ధమవుతోంది.
భేటీ అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్..
తమ విషయంలో నిమ్మగడ్డ వైఖరి కారణంగా స్ధానిక ఎన్నికలపై ఈసీ నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల భేటీకి వెళ్లడం లేదని వైసీపీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం తరఫున అసలు ఈ భేటీయే వద్దంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ వ్యవహారం మలో మలుపు తిరిగినట్లయింది. రాజకీయ పార్టీల భేటీకి వెళ్లడం, వెళ్లకపోవడం ఓ పార్టీగా వైసీపీ ఇష్టం. కానీ అసలు భేటీయే వద్దంటూ ప్రభుత్వమే హైకోర్టుకు వెళ్లడం వైసీపీ రాజకీయంగా కనిపిస్తోంది. అంటే తాము వెళ్లని భేటీ అసలు జరగనివ్వబోమంటూ ప్రభుత్వం మొండిపట్టు పట్టినట్లు అర్దమవుతోంది. దీంతో ఈ వ్యవహారంలో హైకోర్టు నిర్ణయం కీలకంగా మారబోతోంది.
స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయం కనుక్కోవడానికి మాత్రమే నిర్వహిస్తున్న ఈ భేటీ జరగడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. వైసీపీ కూడా ఓ రాజకీయ పార్టీగా తమ అభిప్రాయం చెప్పేందుకు వీలుంది. అయినా ఈ భేటీ జరగొద్దంటూ హైకోర్టుకు వెళ్లడం ద్వారా వైసీపీ నిమ్మగడ్డ విషయంలో ఏ స్ధాయి డిఫెన్స్లో ఉందో అర్ధమవుతోంది.
అంతే పట్టుదలగా నిమ్మగడ్డ...
స్ధానిక ఎన్నికల పోరు వాయిదా తర్వాత ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగి తనపై కులం పేరుతో విమర్శలు చేశాక ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టుతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కూడా అంతే పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో ముందుగా తన తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పునర్ నియామకం ఉత్తర్వులు తెచ్చుకున్న నిమ్మగడ్డ.. బీహార్ ఎన్నికలను చూపుతూ ఏపీలోనూ స్ధానిక పోరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీహార్తో పోలిస్తే ఏపీలో నమోదవుతున్న కేసులు తక్కువే కాబట్టి స్ధానిక పోరు నిర్వహణ విషయంలో ముందుకెళ్తున్నారు. అదే కారణంతో రాజకీయ పార్టీలతో అభిప్రాయ సేకరణ కూడా పెట్టారు.
ఎలాగో వైసీపీ మినహా మిగిలిన పార్టీలు ఈసీతో ఏకీభవించడం ఖాయం. తద్వారా వైసీపీతో పాటు ప్రభుత్వంపైనా ఒత్తిడి పెంచాలనేది నిమ్మగడ్డ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయన రాజకీయ పార్టీలతో భేటీ విషయంలో వైసీపీ రాకపోయినా మిగిలిన పార్టీలతో సమావేశం కావడం ఖాయం. కాబట్టి దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించినా ఆయన మాత్రం నింపాదిగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రయత్నాలు సఫలమైనా, విఫలమైనా తనకే మంచిదని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది.