పేదలకు జగన్ క్రిస్మస్ కానుక- ఇళ్ల స్ధలాల పంపిణీకి ముహుర్తం- అదే రోజు నిర్మాణాలూ ప్రారంభం
ఏపీలో పలుమార్లు వాయిదా పడిన పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇళ్ల స్ధలాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో వైసీపీ నవరత్నాల హామీ మేరకు పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కొత్త మహుర్తం ఖరారైంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఇళ్ల స్దలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25న ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహాయించి మిగిలిన చోట్ల ఇళ్ల స్ధలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 31 లక్షల మంది లబ్ది దారులను ఇప్పటికే గుర్తించారు.
పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి డిసెంబర్ 25న డీ ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్ధలం కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 68 వేల 281 మందిని లబ్దిదారులుగా అధికారులు తేల్చారు. వీరికి ఇళ్ల పట్టాలు లభించనున్నాయి. పలు చోట్ల న్యాయవివాదాల కారణంగా పట్టాల పంపిణీ జరిగే అవకాశం లేదు. ఆయా చోట్ల కోర్టు ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత అదే రోజు తొలి విడత ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. తొలిదశలో దాదాపు 15 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత మరో విడతలో మిగిలినవి పూర్తి చేస్తారు.