సున్నపురాయి అక్రమ తవ్వకం వ్యవహారం: జేసీ దివాకర్ రెడ్డిపై రూ.100 జరిమానా
అనంతపురం: అక్రమంగా గనుల తవ్వకాల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి భారీ జరిమానాను ఎదుర్కొంటున్నారు. ఆయనపై గనుల శాఖ అధికారులు వంద కోట్ల రూపాయల జరిమానా విధించారు. అనంతపురం జిల్లా యాడికి సమీపంలో కోనుప్పలపాడులో అక్రమంగా తవ్వకాల వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల మేర సున్నపురాయిని అక్రమంగా తరలించినట్లు తేల్చారు.
దీని విలువకు సమానంగా జరిమానా విధించినట్లు తెలుస్తోంది. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయిని తరలించే విషయంలో జేసీ దివాకర్ రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు ధృవీకరించారు. జరిమానాను చెల్లించకపోతే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సున్నపురాయిని తవ్వకాలను నిర్వహించిన కేసులో ఆయనపై ఇదివరకే కేసు నమోదైంది.
జేసీ దివాకర్ రెడ్డికి 2007లో ప్రభుత్వం కేటాయించిన సున్నపు రాతి గనుల లీజులను జగన్ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను 2007లో త్రిశూల్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది. 2027 వరకూ లీజుకు ఇచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలను కూడా తీసుకోకపోవడంతో కేటాయింపు జీవోను రద్దు చేసింది ప్రభుత్వం.
ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులను జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి అయిదేళ్ల గడువును పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ.. అక్కడ అక్రమంగా తవ్వకాలను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోటలో జేసీ కుటుంబీకులు నిర్వహిస్తోన్న ఇతర మైనింగ్ సంస్థల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించారు. దీన్ని రాజకీయ కక్షసాధింపుచర్యగా ఆరోపిస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి.