Black fungus: ఆరోగ్యశ్రీ పరిధిలో: తొలిరాష్ట్రంగా ఏపీ: వారి పేర్ల మీద రూ.10 లక్షలు ఫిక్స్డ్
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులు.. ఏపీలోనూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోన్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతోన్నాయి. దీన్ని నివారించడానికి కోవిడ్ ట్రీట్మెంట్ చికిత్స విధానాన్ని మార్చుకోవాల్సి వస్తోంది.
బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీని బారిన పడి పేషెంట్లకు అందించే చికిత్సను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. బ్లాక్ ఫంగస్తో బాధపడే వారు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ- ఆరోగ్యశ్రీ వర్తించే వెసలుబాటును కల్పించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే.. అది ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఇదివరకే కరోనా వైరస్ చికిత్స ఖర్చును జగన్ సర్కార్ ఈ పథకం కిందికి తీసుకొచ్చింది. తాజాగా- బ్లాక్ ఫంగస్ను కూడా దీనికి కిందికి చేర్చింది.
బ్లాక్ ఫంగస్ను నివారించడానికి ఉద్దేశించిన 1600 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ల వయల్స్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కరోనా బారిన పడి మరణించిన వారి పిల్లలకు ఆర్థిక చేయూతను అందివ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేర్లు బ్యాంకుల్లో 10 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సత్వరమే రూపొందించాలని సూచించారు.