జనవరిలో నోటిఫికేషన్..40 రోజుల్లో భర్తీ: ఖాళీలపై సీఎస్ ఆరా: డెడ్ లైన్ విధింపు! ఎక్సైజ్ కు ప్రాధాన్యం
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. అన్ని శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీల భర్తీపై నివేదిక అందజేయడానికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వచ్చేనెల 30వ తేదీ నాటికి ఖాళీల భర్తీపై నివేదిక అందజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ సర్కులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి సంక్రాంతి పండుగకు ముందే ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
రాజ్యాంగం తెలియని వీడు చీఫ్ సెక్రెటరీ అంట: ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
జనవరిలో నోటిఫికేషన్.. ఖాళీల వివరాలకు డెడ్ లైన్..
ప్రభుత్వ ఉద్యోగాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఇకపై ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమారు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. అవన్నీ కొత్తగా సృష్టించినవే. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల రూపంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదికన నియమించినవే.
ఎక్సైజ్ శాఖకు ప్రాధాన్యత..
ప్రస్తుతం చాలా వరకు శాఖల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పించారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన వేతనాలను చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులు వేల సంఖ్యలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. పర్యాటక శాఖ, ఆ శాఖ పరిధిలోని పర్యాటకాభివృద్ధి సంస్థలో 70 శాతం వరకు కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి శాఖల్లో దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తారని అంటున్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ రాజ్, మున్సిపల్, పౌర సరఫరాలు, హోం వంటి శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి తొలి విడత నోటిఫికేషన్ వెలువడొచ్చని అంటున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో..
ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఎన్నో ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఖాళీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామ స్థాయిలో శాఖలు, విభాగాల వారీగా ఉన్న ఉద్యోగాల ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడింది. ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అప్పగించింది. జనవరి మొదటి వారంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉన్నందున.. నవంబర్ 30వ తేదీ నాటికే వాటి వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖలు, విభాగాధిపతులకు ఆయన ఓ సర్కులర్ ను జారీ చేసినట్లు చెబుతున్నారు.
జనవరిలో నోటిఫికేషన్.. పరీక్షలు..భర్తీ
ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ ను జారీ చేసి, ఎప్పుడో భర్తీ చేసే అవకాశమే ఉండబోదని అధికారులు చెబుతున్నారు. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడిస్తే.. అదే నెలలో నియామక పరీక్షలను నిర్వహిస్తామని, చివరి వారం నాటికి వాటి ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగుల భర్తీని పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 40 రోజుల్లోనే నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని అంటున్నారు.