అన్న కాదు..రాజన్న: క్యాంటీన్లకు ముహూర్తం పెట్టేశారు: అక్కడ మాత్రమే ఏర్పాటు
అమరావతి: రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మళ్లీ రాబోతున్నాయి.. రాజన్న క్యాంటీన్ల పేరుతో. పేద వాడికి నామమాత్రపు ధరతో మూడు పూటలా భోజనాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ క్యాంటీన్లను పరిమితంగా తీసుకుని రానుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆసుపత్రుల ఆవరణ లేదా పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1న లేదా సంక్రాంతి పండుగ నాటికి రాజన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
తొలిదశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణల్లో రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. 25 పడకల సామర్థ్యానికి మించి ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటిని నెలకొల్పనుంది. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకుల భోజన అవసరాన్ని తీర్చాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారుల ఉమ్మడి పర్యవేక్షణలో ఈ క్యాంటీన్లు కొనసాగుతాయి. 25 పడకల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మండల స్థాయి ఆసుపత్రుల్లోనూ రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
స్థలం కొరత..
నిజానికి- రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థలాభావం నెలకొని ఉంది. ఆసుపత్రుల ఆధునికీకరణ, వాటికి కొత్త భవనాలను నిర్మించిన అనంతరం స్థలాభావం మరింత క్లిష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో రాజన్న క్యాంటీన్ ను ఎలా ఏర్పాటు చేయగలరనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్లను నెలకొల్పడానికి అవసరమైన స్థలం లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చోట్ల ఆవరణ సమీపంలో గానీ లేదా.. ఆసుపత్రి భవనంలోని ఓ గదిని క్యాంటీన్ గా మార్చడం గానీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపేలా..
ప్రభుత్వ ఆసుపత్రులకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావడంలో రాజన్న క్యాంటీన్లు కొద్దో, గొప్పో సహకరిస్తాయని వైద్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వైద్యానికి వచ్చే వారిలో చాలామంది నిరుపేదలే ఉంటారని, వారికి నామమాత్రపు ఖర్చుతో మూడు పూటలా భోజనాన్ని అందించడం వల్ల చాలామంది ప్రభుత్వ ఆసుప్రతుల వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతం గతంలో కంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యానికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ దుమారం..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూత పడిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ ను మున్సిపల్ శాఖ రెన్యూవల్ చేయలేదు. ఫలితంగా ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్యాంటీన్లు వరుసగా మూతపడుతూ వచ్చాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలను సైతం చేపట్టింది. మూత పడ్డ అన్నా క్యాంటీన్ల వద్ద షామియానాలు వేసి సొంత ఖర్చులతో పేదలకు కొద్దిరోజులు భోజనాన్ని పెట్టారు టీడీపీ నాయకులు.