నిమ్మగడ్డ రీఎంట్రీ: రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ మధ్య: తవ్వి తీస్తోన్న సర్కార్: సుప్రీంలో
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ను పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శరాఘాతంలో తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇప్పటిదాకా వెలువడిన తీర్పులు, ఆదేశాలు ఒక ఎత్తు కాగా.. రమేష్కుమార్ పునర్నియామకం వ్యవహారం మరో ఎత్తులా కనిపిస్తోందని ప్రభుత్వ పెద్దలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో తేల్చుకుంటామని, త్వరలోనే పిటీషన్ దాఖలు చేస్తామని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం పెద్దల్లో విస్మయం..
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పు వస్తుందని భావించ లేదని అంటున్నారు. ఏకంగా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ను సైతం చెల్లదంటూ హైకోర్టు ఆదేశించడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి ప్రాతినిథ్యాన్ని వహించే గవర్నర్ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసిందని అంటున్నారు. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్పై హైకోర్టులో వ్యతిరేకంగా ఇదివరకు ఎలాంటి తీర్పులు వచ్చాయనే అంశాన్ని తవ్వి తీస్తున్నారు.
తవ్వి తీసే పనిలో
పొరుగు రాష్ట్రాల్లో ఇదివరకు వెలువడిన హైకోర్టు ఆదేశాల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు వైసీపీ ప్రభుత్వ పెద్దలు. పొరుగు రాష్ట్రాల్లో ఇవే తరహా పిటీషన్ల విచారణలో ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా వెలువడిన తీర్పులను తవ్వి తీస్తున్నారు. వాటన్నింటినీ క్రోడీకరిస్తూ.. త్వరలోనే సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్లు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోందని, భవిష్యత్తులో కొన్ని కీలక మార్పులకు ఈ తీర్పు కేంద్రబిందువుగా మారడానికి అవకాశం లేకపోలేదని అంటున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదంటూ..
ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గానీ, గవర్నర్ ద్వారా జారీ చేసిన ఆర్డినెన్స్ను గానీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమౌతాయనేది అంచనా వేస్తున్నారు. ఒక రకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ ట్రెండ్ను సెట్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దాని వల్ల ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయనేది ఇప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నారు
రమేష్ కుమార్ పునర్నియామకం..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేస్తోన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ను తొలగిస్తూ.. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదంటూ శుక్రవారం ఏపీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే కనగరాజ్ను తొలగించాలని, ఆయన స్థానంలో రమేష్ కుమార్ను పునర్నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది. ఫలితంగా- రేపో మాపో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మళ్లీ బాధ్యతలను స్వీకరించడం ఖాయమైంది.
Recommended Video
ప్రజాస్వామ్య బద్ధంగా
రమేష్ కుమార్ తొలగింపును, జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగానే నిర్వహించిందని అంబటి రాంబాబు అన్నారు. తీర్పు అందిన తరువాత తాము సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పారు. న్యాయ నిపుణులతో వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓ పార్టీ నాయకుడిగా రమేష్ కుమార్ లేఖ రాశారని ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.