ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్
ఏపీలో విద్యా శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్ . ముఖ్యంగా ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంటర్ లో గ్రేడ్ ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు .ఇక తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణలోనూ పలు అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న వేళ ఇంటర్ పరీక్షల నిర్వహణలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్ .
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు ..ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనపై కీలక వ్యాఖ్యలు
ఇంటర్ పరీక్షల్లో పూర్తి స్థాయి జంబ్లింగ్ విధానం
ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం కీలక మార్పులు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షల నిర్వహిస్తున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారుల నుంచి పలు అభిప్రాయాలను తీసుకుని పరీక్షా విధానంలో పెను మార్పులు చేసింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో జంబ్లింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తుంది.ఇకపై పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఇన్విజిలేటర్లు, డీఈవోలు అందరూ కూడా మారనున్నారు.
సిండికేట్లుగా మారి అక్రమాలకు పాల్పడకుండా నిర్ణయం
సంబంధిత కళాశాలలకు చెందిన ఏ ఒక్కరు అక్కడ ఉండకుండా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో పరీక్షల నిర్వహణకు అంతా బయటవారే ఉండనున్నారు. ఏ పరీక్షా కేంద్రంలో కూడా ఆ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ గానీ ఉండటానికి వీలులేదని నిర్ణయం తీసుకుంది. చాలా కళాశాలలు పరీక్షల సమయంలో సిండికేట్ గా వ్యవహరిస్తూ పరీక్షలలో అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇక దీనికి స్వస్తి చెప్పటానికి ఏపీ సర్కార్ నిర్ణయంలో భాగంగానే భారీ మార్పులు జరగనున్నాయి.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయంలోనూ నూతన విధానం
ఇక వచ్చే నెల 4 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,64,442 మంది విద్యార్థులు వీటికి హాజరు కానున్నారు. ఇక 5,46,162 మంది ఫస్టియర్, 5,18,280 మంది సెకండియర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సిండికేట్ గా మారి అక్రమాలకూ పాల్పడుతున్న కళాశాలలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా పూర్తయిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయంలో కూడా నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్ .
ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు
పరీక్ష జరుగుతున్న సమయంలో అటెండర్, వాటర్ బాయ్, ఇతర సహాయ సిబ్బంది ఎవరీకి కూడా లోనికి వెళ్ళటానికి ఇంటర్ బోర్డు అనుమతులు ఇవ్వలేదు. అలాగే సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.ఇక అంతే కాకుండా గ్రేడ్ లకు బదులు పాత పద్దతి మాదిరిగా మార్కులతో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ క్లాస్లను ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇక ఈ నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీన విద్యాశాఖ మంత్రి ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో సమూలంగా మార్పులు చేస్తూ మెరుగైన విద్యా విధానాన్ని కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.