కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఏపీ సర్కార్ రెడీ .. తొలి దశలో కోటిమందికి , వారికే ఫస్ట్!!
కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు తయారుచేసిన భారత దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి, త్వరలో మార్కెట్లోకి వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటికీ పంపిణీ కోసం కావలసిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు వచ్చే నెల నుండి రాష్ట్రాలకు టీకా పంపిణీ జరగనున్న కారణంగా, ఏపీ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు రెడీ అవుతోంది.
Recommended Video
కోటి మంది టార్గెట్ గా ఏపీలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు
కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చినవెంటనే కోటి మంది టార్గెట్ గా టీకా వేయడానికి కావాల్సిన మౌలిక వసతులను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో 4562 కేంద్రాల ఏర్పాటు, 30 రోజుల పాటు వ్యాక్సినేషన్
ఆ తర్వాత కరోనా పై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన పోలీసులు , శానిటేషన్ వర్కర్లు ఉన్నారు. తరువాత ప్రాధాన్యతగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇస్తారు . వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నుండి ఎనిమిది వారాల తరువాత యాంటీబాడీస్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అంత వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 4562 కేంద్రాలను ఏర్పాటు చేసి 30 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మొత్తం 1,42,857 సెషన్స్ నిర్వహించాలని భావిస్తున్నారు.
నెలరోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్లాన్
రాష్ట్రానికి వచ్చే వ్యాక్సిన్ డోసులు ఆధారంగా ఒక్క నిమిషంలో 70 మంది చొప్పున నెలలో మొత్తం కోటి మందికి టీకా ఇవ్వాలని, కోటిమందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నెల రోజుల్లోనే పూర్తయ్యేలా చూడాలని చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశమంతటికీ కరోనా వ్యాక్సిన్ ను ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యతా క్రమంలో అందించాలని వ్యూహాలు రచిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కేంద్రం దృష్టి సారించింది .
వ్యాక్సినేషన్ కోసం 113 పేజీల మార్గదర్శకాలతో కేంద్రం సన్నాహాలు
మానవ వనరులను ఏర్పాటు చేసుకోవడం, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్, అంతేకాకుండా డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా కూడా కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు చేరువ చేయడానికి కోవిన్ యాప్ ద్వారా కావలసిన అన్ని చర్యలను తీసుకుంటుంది. మరోవైపు టీకాల నిల్వలకు సంబంధించి కోల్డ్ చైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిర్వహించడం పై దృష్టి సారించింది. మొత్తం కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి 113 పేజీలు మార్గదర్శకాలతో కేంద్ర అన్ని వివరాలను పొందుపరిచింది. మరో పక్క రాష్ట్రాలకు సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది.