చంద్రబాబు నియోజకవర్గానికి వైఎస్ జగన్ వరం: వాటి జాబితా ఇదే..మొత్తం 50!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలుగా ఏకచ్ఛాత్రాధిపత్యాన్ని వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నేసినట్టే కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులను మంజూరు చేయనుంది. కుప్పం మున్సిపాలిటీ స్వయం సమృద్ధి సాధించే దిశగా తక్షణ చర్యలను చేపట్టనుంది. కుప్పంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 గ్రామ పంచాయతీల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
సీపీఐ మద్దతు లేకున్నా హుజూర్ నగర్ బరిలో గెలుస్తారట: గులాబీ పార్టీ లెక్క ఇదేనట !!
భారీగా తగ్గిన మెజారిటీ..
తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం అసెంబ్లీ స్థానం. 1989 నుంచి మొన్నటి ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడు ఓటమి అనేదే తెలియకుండా గెలుస్తూ వచ్చారు. గతంతో పోలిస్తే.. ఈ సారి ఆయనకు లభించిన మెజారిటీ చాలా తక్కువ. 27 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో చంద్రబాబు కుప్పం నుంచి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే చంద్రమౌళి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు వైఎస్ జగన్ స్వయంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం.. చంద్రబాబు మెజారిటీని తగ్గించేలా చేసింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉండటానికి కూడా కారణం అదే.
నిధులు గుమ్మరించే ఛాన్స్
ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనే భావన అప్పట్లోనే వెలువడింది. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి చేయడం ద్వారా చంద్రబాబు చేయని పనులను తాము చేశామని చెప్పుకోవడానికి వీలు ఉంటుందనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా గ్రామ పంచాయతీగా ఉంటూ వచ్చిన కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించింది. మిగిలిన మున్సిపాలిటీలతో పోల్చుకుంటే.. అధిక నిధులను గ్రాంటుగా మంజూరు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మొత్తం 50 మున్సిపాలిటీలు..
రాష్ట్రవ్యాప్తంగా కొత్తా 50 మున్సిపాలిటీలను ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుప్పం గ్రామ పంచాయతీ ఒక్కటే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మూడు గ్రామ పంచాయతీలకు చోటు కల్పించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఏకంగా ఏడు కొత్త మున్సిపాలిటీలను ప్రకటించారు. ఆ తరువాతి స్థానంలో ప్రకాశం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఆరు చొప్పున కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో ప్రకటించింది.
జిల్లాల వారీగా కొత్త మున్సిపాలిటీల వివరాలిలా..
గుంటూరు జిల్లాలో దాచేపల్లి, నడికుడిలను ఉమ్మడిగా మున్సిపాలిటీగా ప్రకటించారు. గురజాల, నిజాంపట్నంలను ఈ జాబితాలో చేర్చారు. ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, మార్టూరు, టంగుటూరు, సింగరాయకొండ, వేటపాలెం, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట, చిత్తూరు జిల్లాలో కుప్పం, కర్నూలు జిల్లాలో బేగంచర్ల, కోయిలకుంట్ల, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం, విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం, నక్కపల్లి, పాయకరావు పేట, విజయనగరం జిల్లాలో కురుపాం, చీపురుపల్లి-గరివిడి (ఉమ్మడిగా), శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, రణస్థలం, కడప జిల్లాలో రైల్వే కోడూరు, నందలూరు, వేంపల్లి, తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట, రావులపాలెం, అనపర్తి, జగ్గంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, చింతలపూడి, అత్తిలి, అనంతపురం జిల్లాలో పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం-వవ్వూరు (ఉమ్మడిగా), కోట-వాకాడు-గూడలి, ఆలూరు, పొదలకూరు, ముత్తుకూరు, రాపూరు, తడ-తడ కండ్రిగ (ఉమ్మడిగా) మున్సిపాలిటీలుగా ప్రకటించారు.