జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం- భారీగా తగ్గనున్న ఇసుక ధరలు - వారికోసమే...
ఏపీలో ఇసుక ధరల తగ్గింపు దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఇసుక అందించాలనే లక్ష్యంతో పేదలతో పాటు ప్రభుత్వ పనుల కోసం ఇసుక రవాణా చేసే ట్రాక్ట్రర్లకు చలానా కట్టకుండా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు జారీ చేయగా.. ఇవాళ్టి నుంచి అవి అమలులోకి వస్తున్నాయి.
కాస్సేపట్లో ఏపీ కేబినెట్: కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీ..ఇసుక కార్పొరేషన్? రాజధానులపై
ఇంతవరకూ ట్రాక్టర్ ఇసుక చలానాగా రూ.1300, లోడింగ్ ఛార్జీలు రూ.800, రవాణా ఛార్జీ రూ.1000 నుంచి రూ.1500 కలుపుకుని మొత్తం రూ.3500 నుంచి రూ.4000 వరకూ వసూలు చేసే వారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వినియోగదారులపై ట్రాక్టర్ కు రూ.1300 మేర ధర తగ్గనుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక కోసం వినియోగదారులు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్ -1లో దరఖాస్తు చేసుకోవాలి. 24 గంటల్లో దీన్ని పరిశీలించి పర్మిట్ సమయం, తేదీలతో ఇస్తారు. రీచ్ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే అనుమతిస్తారు. ఇసుక రవాణా సమయంలో గ్రామ సచివాలయం ఇచ్చిన పర్మిట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
అలాగే మినహాయింపులతో ఇస్తున్న ఇసుక రవాణా పక్కదారి పట్టకుండా కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇకపై నోటిఫై చేసిన రీచ్ ల ద్వారా మాత్రమే ఇసుక తరలించాలి. ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామకార్యదర్శి పర్యేవక్షించాలి. ఒకవేళ 1 నుంచి మూడు స్టీమ్స్ లో ఇసుక లభ్యత లేకుంటే నాలుగు, ఐదు స్టీమ్స్ లో ఇసుక తెప్పించి స్టాక్ యార్డుల ద్వారా జిల్లా కలెక్టర్ సరఫరా చేయాలి.