ఏపీలో అన్లాక్ 4.0 మార్గదర్శకాల విడుదల- 21 నుంచి మరిన్ని సడలింపులు...
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్లాక్ 4.0 అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం కేంద్రం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రావడంతో పాటు ఈ నెల 30 వరకూ అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Recommended Video
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలోనే ఇకపై ఆంక్షలు కొనసాగుతాయి. కేంద్రం నిర్దేశించిన విధంగా కంటైన్మెంట్ జోన్ల బయట విద్యాసంస్ధలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ తెరవడంపై మాత్రం ఆంక్షలు ఉంటాయి. ఇవి మినహా మిగిలిన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇకపై కంటైన్ మెంట్ జోన్ల బయట లాక్డౌన్ విధించడానికి వీల్లేదు. అలా విధించాలంటే జిల్లా అధికారులు సైతం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
విద్యాసంస్ధల మూత కొనసాగుతున్నా ఆన్లైన్, దూరవిద్యా కోర్సులను మాత్రం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నెల 21 నుంచి స్కూళ్లలో 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేసేందుకు అనుమతిస్తారు. అలాగే 21 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్ధులు తల్లితండ్రుల అనుమతితో స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. తరగతులు మాత్రం ఉండవు. అలాగే జాతీయ, రాష్ట్ర స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను తెరవబోతున్నారు. ఐటీఐల్లోనూ శిక్షణ కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్కుల మూత కొనసాగనుంది. కానీ ఓపెన్ ఎయిర్ థియేటర్లకు మాత్రం ఈ నెల 21 నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కానీ జిల్లాల మధ్య ప్రయాణానికి కానీ ఎలాంటి ఆంక్షలు ఉండబోవని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని, భౌతిక దూరం పాటించడం, మాస్కుల వినియోగం తప్పనిసరని తెలిపింది. అలాగే ఆరోగ్యసేతు యాప్ వినియోగం కూడా తప్పనిసరిగా ఉంటుందని తెలిపింది.