ఏపీలో జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం - ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా మార్చే పథకం..
ఏపీలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం వైసీపీ సర్కారు ఇవాళ జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల్లో నైపుణ్యాలను మెరుగుపర్చి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కోటి రూపాయల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Recommended Video
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం పేరుతో దీన్ని అమలు చేయబోతోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రారంభించారు. ఏపీలో 16.2 శాతంగా ఉన్న ఎస్సీలు, 6 శాతంగా ఉన్న ఎస్టీల కోసం పారిశ్రామిక పార్కుల్లో ప్రభుత్వం భూములు కేటాయించనుంది. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్ఠిఫికేషన్, పేటెంట్ రుసుముల్లో రాయితీలు కల్పించడం ద్వారా ఆయా వర్గాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారిని ఆ విధంగా తయారు చేసేలా కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఆయా వర్గాల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో పేదల స్దితిగతులను పూర్తిగా మార్చాలని పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు జగన్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలో సీఎం ఆదేశించారు.