జిల్లాగా అమరావతి?: కొత్త జిల్లాల సంఖ్య 29 వరకూ: 3 రాజధానులు..3 ప్రత్యేక జిల్లాలుగా
అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు బీజం పడింది. ఇప్పుడున్న జిల్లాల సంఖ్య రెట్టింపు కాబోతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు విషయం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో కమిటీని నియమించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికల్లా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయి.
ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: కొత్త జిల్లాలకు ఓకే: ఏప్రిల్ 1: రూ.2 వేల కోట్ల లోన్: రెండు ఆర్జీయూకేటీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిని యూనిట్గా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేశారు.
జిల్లాల సంఖ్య ఎంత?
రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశమౌతోన్న అంశం.. జిల్లాల సంఖ్య. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే.. 25 జిల్లాలు ఏర్పడాల్సి ఉంటుంది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 25కు పైగానే జిల్లాలు ఏర్పాడే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితుల మధ్య జిల్లాల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు. 28 నుంచి 29 వరకు జిల్లాలు ఏర్పడతాయని సమాచారం.
మూడు రాజధానులను మూడు ప్రత్యేక జిల్లాలుగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించారు. దీన్ని ఆధారంగా చేసుకుని మూడు రాజధానుల ప్రాంతాలను మూడు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని జిల్లాగా, అమరావతిని చట్టసభల రాజధాని జిల్లాగా, కర్నూలును జ్యుడీషియరీ క్యాపిటల్ జిల్లాగా ప్రకటించే అవకాశం లేకపోలేదని సమాచారం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని జిల్లా ప్రకటించి, శివారు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా గుర్తించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
సచివాలయ ప్రాంతాన్ని కేంద్రంగా..
అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాలు రెండు జిల్లాలుగా ఏర్పాటవుతాయి. దీనికి అదనంగా సచివాలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని కేంద్రబిందువుగా తీసుకుని ఆ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జిల్లాగా ప్రకటిస్తారని అంటున్నారు. అసెంబ్లీ కొనసాగుతోన్న వెలగపూడి ప్రాంతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని సీఆర్డీఏ పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ జిల్లాగా గుర్తించే అవకాశం ఉందని సమాచారం. అలాగే- కర్నూలును కూడా జ్యుడీషియరీ క్యాపిటల్ జిల్లాగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.
Recommended Video
అరకును రెండు జిల్లాలుగా..
అరకు లోక్సభ స్థానం విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని రెండు జిల్లాలుగా ప్రకటించే అంశాన్ని ఇప్పటికే మంత్రివర్గం పరిశీలనలోకి తీసుకుంది కూడా. ఈ నియోజకవర్గం పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం ఉన్నాయి. వాటిని విభజించవచ్చని అంటున్నారు. కురుపాంను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. ఆయా అంశాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటయ్యే కమిటీ అధ్యయనం చేయనుంది.