నవంబర్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు- వచ్చేవారం కేబినెట్ భేటీలో నిర్ణయం..
ఏపీలో కీలక బిల్లులతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. వచ్చే నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతోంది.
ఏపీలో జూన్లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి శాసనసభ భేటీ కాలేదు. ప్రస్తుతం రాష్టంలో ప్రభుత్వం పలు కీలక ఆర్డినెన్స్లు జారీ చేస్తోంది. దీంతో పాటు దిశ చట్టంలో మార్పులు చేసి మరోసారి ఆమోదించాల్సి ఉంది. అదే సమయంలో విశాఖకు రాజధాని మార్పుకు సంబంధించిన నిర్ణయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. దీంతో కీలక బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కూడా తగ్గినందున అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని సమాచారం.
వచ్చే నెల 5వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. గతంలో నాలుగుసార్లు వరుసగా వాయిదా పడిన కేబినెట్ భేటీని ఈసారి ఎలాగైనా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాల్సిన బిల్లులు, ఇతర అంశాలపై చర్చించబోతున్నారు. ఇందులో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపైనా మంత్రిమండలి చర్చిస్తుంది. దీని ఆధారంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజుల పాటు ఉండొచన్న దానిపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి నవంబర్ 15 తర్వాత వారం రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నవంబర్లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తాజాగా వెల్లడించారు.