గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ .. మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధన
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల చేయాలనుకుంటే కచ్చితంగా మూడేళ్లపాటు పని చేసి తీరాలని చెబుతోంది. అపాయింట్మెంట్ ఆర్డర్లో ప్రభుత్వం పెట్టిన నిబంధన గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. వారిని సందిగ్ధంలో పడేసింది.
అపాయింట్మెంట్ ఆర్డర్లలో నిబంధన చూసి షాక్ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు
ఏపీలో నిరుద్యోగులు పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పోటీ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సమయంలో గ్రామ సచివాలయం పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ ఉద్యోగాలకు సైతం పరీక్ష రాసిన అభ్యర్థులు కొందరు ఉద్యోగాలు పొందారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు.
మూడేళ్ళు తప్పనిసరిగా పని చెయ్యాల్సిందే
అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. ఇక ఈ నిబంధన అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులను అయోమయంలో పడేసింది. నోటిఫికేషన్లో రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పనిచేయాలని మాత్రమే పేర్కొన్నారని, మూడేళ్లు కచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు పేర్కొంటున్నారు.
ఉద్యోగం మానేస్తే గౌరవ వేతనం , శిక్షణ వ్యయమ తిరిగి చెల్లించాలని నిబంధన
అయితే పలు పోటీపరీక్షలను ఇప్పటికే రాసి ఉన్న అభ్యర్థులు ఇంతకంటే మంచి ఉద్యోగ అవకాశం వస్తే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు గ్రామ సచివాలయ ఉద్యోగాలు చెయ్యాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు ఉద్యోగార్థులు. ఒకవేళ చేరితే, ఆ తర్వాత ఇంతకంటే మంచి అవకాశం వస్తే గ్రామ సచివాలయ ఉద్యోగాలు మానేయాల్సి వస్తే వారికి ఇచ్చిన గౌరవ వేతనాన్ని, శిక్షణ కోసం ఖర్చు చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడం అంటే అది వారికి ఇబ్బందికరమైన అంశం .
డైలమాలో ఉద్యోగులు ... ప్రభుత్వ నిబంధనపై అసహనం
ఇక ప్రస్తుతం సచివాలయం ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఆర్డర్లో ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది అభ్యర్థులు ఇంత కఠినమైన నిబంధనలతో, గౌరవ వెతనానికే ఈ ఉద్యోగం చేయడం అవసరమా అన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగార్థులకు షాకింగ్ అని చెప్పాలి.