ఏపీ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు- ఈ పాస్ తప్పనిసరి- సమస్య కరోనా కాదు- ఆ భయమే....
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను కేంద్రం క్రమంగా సడలింపులతో అన్ లాక్ చేస్తున్న నేపథ్యంలో అంతర్ రాష్ట్ర రాకపోకలకు కూడా అనుమతి ఇచ్చేసింది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం సడలింపులతో రాకపోకలపై నియంత్రణ ఎత్తేశాయి. కానీ ఏపీ మాత్రం పొరుగు రాష్ట్రాల నుంచి ఈ-పాస్ ఉంటేనే రాకపోకలకు అనుమతిస్తోంది. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి కాదు. అంతకు మించిన మరో సమస్యే అనేది అధికార వర్గాల సమాచారం.
సరిహద్దులో తొలగని ఆంక్షలు
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను కేంద్రం విడతల వారీగా సడలిస్తోంది. ఇందులో భాగంగా మిగతా రాష్ట్రాలు రాకపోకలపై నిషేధం ఎత్తేసినా ఏపీ మాత్రం పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిషా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు, వ్యక్తులను ఈ-పాస్ లేనిదే అనుమతించడం లేదు. దీంతో ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీకి రావాలంటే స్పందన పోర్టల్ లో ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అనుమతి పొందాల్సిందే అని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ-పాస్ లేకపోతే మాత్రం సరిహద్దుల్లో నిర్దాక్షిణ్యంగా ఆపేస్తున్నారు.
సమస్య కరోనా కాదు....
వాస్తవానికి కేంద్రం అంతర్ రాష్ట్ర రాకపోకలకు అనుమతించిన తర్వాత ఏపీ మాత్రం రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో అంతా పెరుగుతున్న కేసులతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వైరస్ ఏపీలోని జిల్లాలకు ప్రబలే అవకాశం ఉందేమో అనుకున్నారు. కానీ గతంలోలా సరిహద్దుల్లో కరోనా ప్రాథమిక టెస్టులు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఈ-పాస్ తీసుకొని వస్తున్న వారినైనా క్వారంటైన్ కు పంపుతున్నారా అంటే అదీ లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట....
ఏపీ సరిహద్దుల్లో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడం వెనుక అసలు కారణం కరోనా కాదు మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే అని తెలుస్తోంది. ఏపీలో మద్యనిషేధం క్రమంగా అమలు చేస్తుండటం, భారీగా పెరిగిన మద్యం ధరలతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నామనే పేరుతో అక్రమ మద్యాన్ని జనం విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారనేది సరిహద్దు ఆంక్షలకు ప్రధాన కారణం.
Recommended Video
గుట్టుచప్పుడు కాకుండా కోట్ల వ్యాపారం
లాక్ డౌన్ కాలంలో ఏపీ సరిహద్దులను మూసేసినా గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయల అక్రమ మద్యం రవాణా అయిపోయింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులతో కుమ్మక్కై మరీ అక్రమ మద్యాన్ని వ్యాపారులు దిగుమతి చేసుకుని అమ్మేసుకున్నారు. ఏపీతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో చాలా చవకగా దొరుకుతున్న మద్యాన్ని ఇక్కడ బ్లాక్ లో అమ్మడం ద్వారా ఈ రెండు, మూడు నెలల్లోనే వీరు కోట్లాది రూపాయలు సంపాదించారు. అయినా పోలీసులు, టాస్క్ ఫోర్స్, ఎక్స్జైజ్ శాఖ దిక్కులు చూడాల్సిన పరిస్ధితి. పలు మార్గాల్లో ఏపీకి చేరిపోతున్న మద్యాన్ని అడ్డుకోలేక వీరంతా చేతులెత్తేశారు. మధ్యలో విమర్శలు రావడంతో అక్రమ రవాణాకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప ఇవాళ్టికీ మద్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. అదే సరిహద్దులు పూర్తిగా తెరిస్తే ఈ దందా ఎన్నో రెట్లు అధికంగా సాగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఈ ఆంక్షలు మరికొన్నాళ్లు కొనసాగించే అవకాశముంది.