క్వాలిటీ లోపం ఆరోపణలతో ముగ్గురు సీఆర్డీయే ఇంజనీర్లపై విచారణకు ఆదేశాలు
అమరావతి:ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల్లో నాణ్యతా లోపం ఆరోపణలతో ముగ్గురు సిఆర్డీఏ ఇంజనీర్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు సంబంధించిన ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లోగా ఈ ముగ్గురు ఇంజనీర్లు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. వివరాల్లోకి వెళితే...
విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఫ్లైవోవర్లలో ప్రమాణాల మేరకు నాణ్యత ఏ మాత్రం లేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి అప్పటి వీజీటీఎం ఉడా, ప్రస్తుతం ఏపీసీఆర్డీయేలో ఇంజినీర్లుగా పని చేస్తున్న ముగ్గురు అధికారులపై ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వీజీటీఎం ఉడాలో ఈఈగా పని చేసి, ఇప్పుడు సీఆర్డీయేలో ఎస్.ఇ.గా ఉన్న బి.శ్రీనివాసరావు, అప్పట్లో డిప్యూటీ ఈఈగా ఉండి ప్రస్తుతం ఈఈగా పని చేస్తున్న ఎం.వి.సుబ్బారావు, అప్పట్లో ఏఈఈగా ఉండి ప్రస్తుతం డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న ఎం.ఎస్.రామకృష్ణలు ఈ విచారణ ఎదుర్కోనున్నారు. ఎంక్వైరీ ఉత్తర్వులు అందిన 10 రోజుల్లోగా పైన పేర్కొన్న ముగ్గురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వారు సకాలంలో తగురీతిన వివరణ ఇవ్వని పక్షంలో ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.