పల్నాడు అక్రమ మైనింగ్ కేసులో...అధికారులపై వేటు:సిఐడి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం
అమరావతి:సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా పల్నాడులో సున్నపురాయి అక్రమ తవ్వకాలపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనులశాఖ కార్యదర్శి శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
మరోవైపు ఈ అక్రమ మైనింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మైనింగ్ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాధరావులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు సున్నపురాయి అక్రమ తవ్వకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు ప్రభుత్వం కలెక్టర్ను ఆదేశించింది.
పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలు, కోర్టులో వాజ్యాల దాఖలు నేపథ్యంలో అక్రమ మైనింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ మైనింగ్ వెనుక అసలు వాస్తవాలు వెలుగుచూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త నాటకాలు మొదలు పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తూ వారిని బలిపశువులు చేయాలని చూస్తోందని వైసిపి నేతలు చెబుతున్నారు.
మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తోందని, ఇది దారుణమని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేసి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే ఈ తతంగాన్ని నడిపించిన అధికారపార్టీ ఎమ్మెల్యే, తెరవెనకపెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. "మైనింగ్ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది... ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగిందనేది వైసిపి నేతల వాదన.
వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ..."రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది?... ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి"...అని డిమాండ్ చేశారు.