ఏపీలో వరుస ప్రమాదాలపై సర్కార్ సీరియస్- పరిశ్రమల్లో స్పెషల్ డ్రైవ్ పేరిట తనిఖీలకు ఆదేశం..
ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పారిశ్రామిక ప్రమాదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా విశాఖ పారిశ్రామికవాడలో జరుగుతున్న వరుస ప్రమాదాలు పాలనా రాజధాని ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు ఏ మేరకు దృష్టిపెట్టారో తెలియదు కానీ ఇదంతా విపక్షాల కుట్రేనంటూ స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్న పరిస్దితి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ వరుస ప్రమాదాలపై నిర్వహించిన సమీక్షలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది.
ఏపీలోని అన్ని పరిశ్రమల్లో 90 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ పేరుతో అని విధాలా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా స్ధాయిలో పరిశ్రమల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన కమిటీలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాయింట్ కలెక్టర్ ఛైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎలాంటి జాగ్రత్తలైనా 30 రోజుల్లో తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీలకు ప్రభుత్వం సూచిస్తోంది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటరిగీ పరిశ్రమలు ఇలా అన్నింటిలోనూ తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. 90 రోజుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీలకు సూచించింది.