'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణ: ఎలా జరిగింది?, నివేదిక ఇవ్వండని మంత్రి అదేశం
హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ కడితే పదో తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని చెప్పి డిపాజిట్లు సేకరించినట్లు కేశవరెడ్డి విద్యాసంస్థలు అధినేతపై ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
డిపాజిట్ల సేకరణపై తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు విద్యార్ధుల తల్లిదండ్రులు నమోదు చేసిన కేసులు, కేశవ్ రెడ్డి అరెస్ట్ పై కర్నూలు ఎస్పీ రవికృష్ణతో మంత్రి గంటా శ్రీనివాసరావు సాయంత్రం ఫోన్లో మాట్లాడారు.
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని తాము బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని కర్నూలు ఎస్పీ రవికృష్ణ చెప్పారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఆయన పైన అయిదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 11వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ మొత్తంలో భాకీ పడ్డారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలోని మదనపల్లిలో రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు, తిరుపతి బ్రాంచిలోను పెద్ద మొత్తం ఉన్నట్లుగా తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ఉన్న విద్యాసంస్థల అధినేత కేశరెడ్డి గురువారం మధ్యాహ్నాం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎవరినీ మోసం చేయదల్చుకోలేదని, స్థిరాస్థి వ్యాపారం కోసం భూములు కొన్నానని చెప్పారు. ప్రస్తుతం వాటి విలువ చాలా తక్కువగా ఉందని చెప్పారు.
ఏడాది సమయం ఇస్తే తాను ఆస్తులను అమ్మి అందరి డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. ప్రభుత్వం తన భూములను స్వాధీనం చేసుకొని డబ్బులు చెల్లించినా అభ్యంతరం లేదన్నారు. తనకు మోసం చేయాలనే మనస్తత్వమే ఉంటే సంవత్సరం నుంచి సమస్యను పరిష్కరించాలని ఎందుకు చూస్తానన్నారు.