గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- డ్యూటీ చేసే చోటే నివాసం తప్పనిసరి..
ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగులను నియమించింది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలాయలకు వెళితే చాలు ఏ పనైనా జరుగుతుందన్న భరోసా ఇచ్చింది. కానీ రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పని చేసే చోట నివాసం ఉండకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది.
Recommended Video
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రజలకు వారు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై గ్రామ, వార్డు ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారు సదరు గ్రామ పరిధిలో, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది మున్సిపాలిటీ లేదా కార్పోరేషన్ పరిధిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది.
డివిజనల్, మండల స్ధాయి అధికారులు సదరు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించి ఉద్యోగులు అక్కడే నివాసం ఉంటున్నారో లేదా అనే అంశాన్ని తరచుగా పరిశీలించాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు వందశాతం అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ సిటీల్లో ఉంటున్న ఉద్యోగులకు చుక్కలు కనిపించడం ఖాయం.