రాజన్న బడిబాట కానుక:గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులు..ఉచిత రవాణా?
అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం మరో అడుగు వేయబోతోంది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత రవాణా వసతిని కల్పించడానికి ఈ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ అధ్యయనం చేస్తోంది. అన్నీ కుదిరితే- ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావచ్చని తెలుస్తోంది.
వీడియో: కోల్కత..రణరంగం! బీజేపీ కార్యకర్తల ఆందోళన! అడ్డుకున్న పోలీసులు.. విరిగిన లాఠీలు!
రవాణా సౌకర్యాలు లేక.. పాఠశాలలకు వెళ్లలేక
ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం బస్పాస్ సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. పాస్ ఉన్న విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి, వస్తుంటారు. చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. ఉన్నప్పటికీ.. పాఠశాల సమయానికి అనుగుణంగా అవి నడవట్లేదు. బస్సు అందుబాటులోకి వస్తేనే విద్యార్థులు పాఠశాలకు వెళ్లే పరిస్థితుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వమే సొంతంగా ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని యోచిస్తోంది. బస్ పాసుల వ్యవస్థను యథా ప్రకారం కొనసాగిస్తూనే.. దీనికి అదనంగా- ఉచిత రవాణా కల్పించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ప్రైవేటు స్కూళ్ల తరహాలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామగ్రామాన ప్రైవేటు స్కూళ్లు పుట్టుకొచ్చాయి. నాణ్యమైన విద్యాబోధన పేరుతో పేద కుటుంబాల నుంచీ వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం, వారిని ఉన్నత విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో తమ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ.. తాహతును మించినప్పటికీ.. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఫీజులతో పాటు రవాణా వసతిని కల్పించడానికి ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి, అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
వాటికి చెక్ చెప్పేలా..
ప్రైవేటు స్కూళ్ల రవాణా వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, ఉచిత రవాణా వసతిని కల్పించాలని వైఎస్ జగన్ సర్కార్ భావిస్తోంది. తొలిదశలో గ్రామాలు, క్రమంగా మండలాల స్థాయిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాహనాలను ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సరైన సమాధానం దొరికితే.. ఈ వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకుని రావాలనేది వారి ఆలోచన. విద్యార్థి ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి, వారిని ఎక్కించుకుని పాఠశాలలకు వెళ్లేలా చేయాలని తాము భావిస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
రవాణా సమస్యను అధిగమిస్తే..
గ్రామస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య రవాణాయేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు దీన్ని అధిగమించగలిగితే- విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేలా చేయడం పెద్ద కష్టతరమైన పని కాదని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి జారీ చేసిన పాస్ల వ్యవస్థను కొనసాగిస్తూనే.. బస్సు సర్వీసులు అందుబాటులో లేని చోట్ల ప్రత్యేక వాహనాల ద్వారా విద్యార్థులను పాఠశాలలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల మధ్యలో బడి మాని వేసే పిల్లల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, అదే సమయంలో కొత్త విద్యార్థులను ఆకర్షించగలుగుతామని అధికారులు అంటున్నారు.