గ్రామ సచివాలయాలపై జగన్ కీలక నిర్ణయం?: అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అంటూ విమర్శలు
అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనా వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేయడానికి ఉద్దేశించినట్లుగా చెబుతోన్న గ్రామ సచివాలయాలపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏర్పాటైన అన్ని గ్రామ సచివాలయాల్లో ఎన్నికల మేనిఫెస్టోను ఫ్లెక్సీల ఏర్పాటును తప్పనసరి చేయనుంది. ఇప్పటికే కొన్ని గ్రామీణ స్థాయిలో తహశీల్దార్, మండల రెవెన్యూ అధికారి కార్యాలయాల్లో ఎన్నికల మేనిఫెస్టో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీన్ని మరింత విస్తృతం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
ప్రతి చోటా నవరత్నాలు పొదిగిన మేనిఫెస్టో..
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలక పాత్ర పోషించిందంటూ రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాము ప్రకటించిన నవరత్నాల పథకాలను పొందుపరిచిన మేనిఫెస్టోను వైఎస్ జగన్.. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసుకున్నారు. నవరత్నాల్లోని ప్రతి పథకానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను వాటిల్లో పొందుపరిచారు. తాను చేసిన వాగ్దానం ప్రతిక్షణం తనకు గుర్తుకు తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే వాటిని తన ఛాంబర్ లో అమర్చానని వైఎస్ జగన్ చెప్పుకొంటారు.
నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకుని..
అదే విధానాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేయాలని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి కూడా. దీని పరిధిని మరింత పెంచుతూ ఇక గ్రామ సచివాలయాల్లో కూడా వాటిని ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామ సచివాలయాల్లో పని చేసే ప్రతి ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టోకు ప్రాధాన్యత..
ఎన్నికల మేనిఫెస్టోకు వైఎస్ జగన్ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారనేది చాలా సందర్భాల్లో రుజువైంది. తమ చేతికి అధికారాన్ని అప్పగించిన నవరత్నాల వంటి మేనిఫెస్టోను తాము భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా పవిత్రంగా భావిస్తామంటూ ఇదివరకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సైతం చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఓటర్లు కూడా విస్మరించకూడదని, అందులోని అంశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి క్షణం గుర్తుకు రావాల్సిన అవసరం ఉందని ఇదివరకు ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో వాటి ఫ్లెక్సీలు తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ
గ్రామ సచివాలయాల్లో ఎన్నికల మేనిఫెస్టో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై అప్పుడే విమర్శలు వెలువడుతున్నాయి. గ్రామ సచివాలయాలకు పార్టీ జెండాలోని రంగులను వేసింది అధికార వైఎస్ఆర్సీపీ. దీనిపై ఇప్పటికే సెటైర్లు సంధిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు. అధికారాన్ని వికేంద్రీకరిస్తామంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా గ్రామ సచివాలయ గోడలకు ఎక్కిందంటే ఇక పూర్తి పార్టీ కార్యాలయంలా తయారవుతుందని ఆరోపణలు చేస్తున్నారు.