జగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కి
అమరావతి: రాష్ట్రంలో మరోసారి భూముల అమ్మకాలపై జగన్ సర్కార్ దృష్టి సారించింది. భారీ ఎత్తున భూములను అమ్మకానికి పెట్టడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించే పనిలో పడింది. రాష్ట్రంలో చేపట్టబోతున్న అభివృద్ధి పథకాలు, ఇతర ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమీకరించుకోవడంలో భాగంగా రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని భూములను విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం అమరావతి పరిధిలో 1600 ఎకరాలను గుర్తించినట్లు సమాచారం. ఈ భూములను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు మిషన్ బిల్డ్ ఏపీకి బదలాయిస్తారని చెబుతున్నారు.
వైసీపీ కొత్త ఎంపీలకు అప్పుడే కీలక పదవులు: పిల్లి సుభాష్కు ఇండస్ట్రీస్, మోపిదేవికి కోల్
అమరావతి ప్రాంతం పరిధిలో నిరుపయోగంగా ఉన్న 1600 ఎకరాల భూములను విక్రయించాలని భావిస్తున్నట్లు మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టుకు ఓ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంత పరిధిలో స్టార్టప్లను ఏర్పాటు చేయడానికి ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని సింగపూర్ కన్సార్టియానికి అప్పగించింది. ప్రస్తుతం ఆ పనుల నిర్మాణం ఆగిపోయింది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగింది.
ఫలితంగా సింగపూర్ కన్సార్టియానికి కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చాయి. వాటిని విక్రయించాలని తాజాగా ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదివరకు గుంటూరు, విశాఖపట్నంలల్లో తొమ్మిది ప్రాంతాల్లో భూములను అమ్మకానికి ఉంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్పై విచారణ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారని సమాచారం. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలను సాగిస్తోన్న నేపథ్యంలో.. అమరావతికి ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయం దీనితో మరోసారి స్పష్టమైందని అంటున్నారు.
సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడానికి, అమరావతిని చట్టసభల రాజధానిగా మాత్రమే పరిమతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సింగపూర్ కన్సార్టియాన్ని కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఇప్పటికే- మూడు రాజధానుల కాన్సెప్ట్ పట్ల అమరావతి ప్రాంత రైతులు, వారు నిర్వహిస్తోన్న ఉద్యమానికి సారథ్యాన్ని వహిస్తోన్న తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా భూములను కూడా అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి ఎదురైతే.. రాజకీయంగా మరిన్ని విమర్శలు జగన్ సర్కార్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.