మరింత అప్పుల్లోకి ఏపీ- ఎఫ్ఆర్బీఎం ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం- కేంద్రం సై అంటే...
2014లో రాష్ట్ర విభజన సమయంలో 90 వేల కోట్ల పైచిలుకు అప్పులతో ప్రస్ధానం ప్రారంభించిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.5 లక్షల కోట్లకు దాన్ని పెంచేసింది. గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిపై విమర్శలు చేస్తూనే తాను కూడా అదే బాటలో పయనిస్తోంది. ఏడాది కాలంలో భారీగా అప్పులు చేసిన వైసీపీ సర్కారు.. కొత్త రికార్డులు బద్దలు కొట్టే దిశగా పయనిస్తోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు అవకాశంతో మరిన్ని అప్పులు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసిన ప్రభుత్వం... ఇందుకోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం కూడా పొందింది.
పెరగనున్న ఎఫ్ఆర్బీఎం పరిమితి...
రాష్ట్రాలు తమ అవసరాలకు తగినట్లుగా అప్పులు తెచ్చుకునేందుకు ద్రవ్యనియంత్రణ మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. ఇందులో పరిమితుల మేరకు ఇప్పటివరకూ రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో 3.5 శాతం మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వీలుంది. కానీ కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితి కుదేలైనందున కేంద్రం ఎప్ఆర్ఎం పరిమితిని పెంచుకునేందుకు వీలు కల్పించింది. అయితే కొన్ని షరతులు విదించింది. రాష్ట్రాల్లో కొన్ని విధానపరమైన సంస్కరణలు చేపట్టడం ద్వారా వీటికి అవకాశం ఇచ్చింది. దీంతో కేంద్రం విధించిన షరతులను పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఎప్ఆర్బీఎం పరిమితి పెంచుతూ చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 3.5 శాతం పరిమితి ఐదు శాతానికి పెరగబోతోంది.
కేంద్రం ఆమోదం తరువాయి...
కరోనా సందర్భంగా రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఎప్ఆర్బీఎం చట్టంలో సవరణలు చోటు చేసుకున్నాయి. వివిధ మార్గాల్లో మరో ఒకటి న్నర శాతం అప్పులు పొందేందుకు రాష్ట్రాలు చట్టాలను సవరిస్తున్నాయి. ఇదే క్రమంలో కేంద్రం ఇచ్చిన షరతులకు లోబడి ఏపీ ప్రభుత్వం కూడా ఎప్ఆర్బీఎం చట్టంలో సవరణలు చేస్తూ పరిమితిని ఐదుశాతానికి పెంచుకుంది. ఈ మేరకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కూడా లభించింది. దీన్ని కేంద్రానికి పంపుతారు. కేంద్రం కూడా దీన్ని ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగో తాము ఇచ్చిన షరతులను ఆమోదించినందున ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Recommended Video
మరో రూ.20 వేల కోట్ల అప్పులు...
ఏపీ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ఎప్ఆర్బీఎం పరిమితి పెంపు ప్రకారం రాష్ట్రానికి ఏటా మరో రూ.20 వేల కోట్ల రూపాయలు అధికంగా అప్పులు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే వరుసగా భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకున్న రాష్ట్రానికి ఇది భారీ ఊరట కానుంది. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలకు కూడా అప్పులపైనే ఆధారపడుతున్న రాష్ట్రానికి ఇది గణనీయమైన వెసులుబాటుగానే చెప్పవచ్చు. అయితే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్న విపక్షాల విమర్శలకు ఈ నిర్ణయం మరింత బలం చేకూర్చబోతోంది. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ను మాత్రమే వాడుకుంటున్నట్లు ఆర్ధికశాఖ చెబుతోంది. ఏ విధంగా చూసినా రాష్ట్రంపై అప్పుల భారం మాత్రం భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.