ఏపీ సీడ్ క్యాపిటల్ నిర్మాణం: చైనాకే తొలి అవకాశం, కుదరదన్న సింగపూర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మించేందుకు గాను (సీడ్ క్యాపిటల్) నిర్మాణానికి మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను అవలంభించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీంతో రాజధాని నిర్మించనున్న గ్రామాల్లోని ప్రజలకు ఈ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియ ఏంటనే సందేహాలు ఏర్పడ్డాయి.
స్విస్ ఛాలెంజ్ ప్రక్రియ ఎప్పటి నుంచో అమలులో ఉన్నా, సామాన్య ప్రజలకు తెలియదు. రాజధాని నిర్మాణ కమిటీలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్విస్ ఛాలెంజ్ అంటే ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ప్రభుత్వం ముందుగా ఒక మాస్టర్ డెవలపర్ను పిలుస్తుంది.
వారి వద్ద నుంచి బిడ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మరికొంత మంది డెవలపర్ల నుంచి కూడా బిడ్లను ఆహ్వానిస్తుంది. ముందుగా బిడ్ ఇచ్చిన డెవలపర్ కంటే తక్కువ అంచనా విలువకే మిగతా డెవలపర్లు సమర్పించిన బిడ్లు ఉంటే
మాస్టర్ డెవలపర్తో మరోసారి చర్చిస్తుంది.
మాస్టర్ డెవలపర్ రెండోసారి సమర్పించే బిడ్ అందరికంటే తక్కువగా ఇస్తే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను వారికే అప్పగిస్తారు. అలాలేని పక్షంలో తక్కువకు బిడ్ దాఖలు చేసిన వారికే ప్రాజెక్టు నిర్మాణను బాధ్యతలను అప్పగిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియనే ఏపీ నూతన రాజధాని విషయంలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ నూతన రాజధానిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఎంతో కీలకం. ఈ సీడ్ క్యాపిటల్ నిర్మాణంలోనే శాసనసభ, శాసనమండలి, రాజ్భవన్, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు, సీఎం క్యాంపు ఆఫీసు లాంటివాటిని నిర్మిస్తారు.
ఈ సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందుకు గాను జపాన్, చైనా, సింగపూర్ దేశాల సహకారాన్ని ప్రభుత్వం కోరుతోంది. మొదటి నుంచి కూడా సింగపూర్పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీంతో సింగపూర్ ఇప్పటికే ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది.
కేవలం ప్లాన్కు మాత్రమే పరిమితమవుతామని, రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడం కుదరదని సింగపూర్ స్పష్టం చేసింది. దీంతో జపాన్, చైనా దేశాల సహకారం పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతోంది. చైనాలోని షాంగై నగరం తరహాలో ఏపీ నూతన రాజధాని అమరావతిని నిర్మించాలని అనుకుంటున్న సీఎం చంద్రబాబు తొలి అవకాశం చైనాలోని డెవలపర్స్కే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.