ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు వాట్సాప్ పాఠాలు- ప్రతీ స్కూల్ కో గ్రూప్...
కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు మూతపడటం విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకూ స్కూళ్లకు వెళ్లి పాఠాలు నేర్చుకున్న విద్యార్ధులు ఇప్పుడు బిక్కిబిక్కుమంటూ ఇళ్ల వద్దే గడపాల్సిన పరిస్ధితి. దీన్ని అధిగమించేందుకు ఏపీలో విద్యాశాఖ ఎన్నో విన్నూత కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తోంది. పదో తరగతి విద్యార్ధుల కోసం ఇప్పటికే దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలు, ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు అందిస్తున్న విద్యాశాఖ... తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమవుంది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్ విద్యాబోధనలో ఇదో గొప్ప ముందడుగు కానుంది.
పదో తరగతి విద్యార్ధులకు వాట్సాప్ పాఠాలు..
ఏపీలో కరోనా వైరస్ కారణంగా ఇళ్ల వద్దే ఉంటున్న పదో తరగతి విద్యార్ధులకు వాట్సాప్ ద్వారా సిలబస్ తో పాటు ఇతర బోధనాంశాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు కోసం ప్రతీ పాఠశాలకూ ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయనుంది. ఈ గ్రూపులో సదరు పాఠశాలకు చెందిన అధ్యాపకులతో పాటు విద్యార్ధులను భాగస్వాములను చేస్తారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యార్దుల సంఖ్యను బట్టి చూస్తే దాదాపు పాతికవేల మంది విద్యార్ధులతో పాటు వెయ్యి మంది అధ్యాపకులు కూడా ఈ గ్రూపుల్లో చేరాల్సి ఉంటుంది.
వాట్సాప్ లో యూట్యూబ్ లింక్ లు..
టీచర్లు తాము చెప్పదలుచుకున్న పాఠాలను వీడియో ద్వారా రికార్డు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తారు. దీని లింక్ ను విద్యార్ధులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారు. వీటిని ఓపెన్ చేసుకుని విద్యార్ధులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్ ను, హోం వర్క్ ను కూడా డాక్యుమెంట్ల రూపంలో తయారు చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో కానీ మెయిల్ ద్వారా కానీ టీచర్లకు పంపాల్సి ఉంటుంది.
కాలయాపనకు చెక్.. కరోనాకూ...
కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో ప్రభుత్వం ప్రవేశపట్టాలని భావిస్తున్న ఈ వాట్సాప్ బోధనా విధానం ద్వారా సమయం కలిసి రావడంతో పాటు కరోనా నుంచి దూరంగా ఉండేందుకు కూడా వీలు కలుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. ఈ విధానం అమల్లో ఉన్న ఇబ్బందులపై చర్చిస్తున్న అధికారులు. త్వరలో తుది ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పాఠశాలలకు సర్క్యులర్ పంపిస్తారు.
ప్రస్తుతానికి పదో తరగతి విద్యార్ధులకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం... త్వరలో ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.