ఏపీలో ఆగస్టు 3 నుంచి ఆన్ లైన్ విద్యాసంవత్సరం- ఆరునెలల బోధన- 30 శాతం సిలబస్ కట్..
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంలో విద్యార్ధులను స్కూళ్లకు పంపే పరిస్దితి లేదు. దీంతో ఆన్ లైన్ విద్యా బోధనకే ప్రైవేటు స్కూళ్లు కూడా మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఏపీలోనూ ప్రభుత్వం ఇదే తరహాలో ఆగస్టు 3 నుంచి ఆన్ లైన్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. దూరదర్శన్ ద్వారా పాఠాలను విద్యార్ధులు ఇంటివద్దనే ఉంటూ నేర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Coronavirus: కరోనా పాజిటివ్, 'ఆరు’నూరైనా పెళ్లి జరగాలి, శోభనం మమా, అంతలోనే అంత్యక్రియలు !
ఆన్ లైన్ విద్యా సంవత్సరం...
ఏపీలో కరోనా కారణంగా విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడం, ఇప్పటికే విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో ఇక ఆన్ లైన్ వైపు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో, దాంతో సంబంధం లేకుండా ఇళ్లలోనే ఉంటూ విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా చదువుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠ్యాంశాల బోధనతో పాటు టీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు కల్లా ఈ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.
ఆరునెలల బోధన, సిలబస్ లో కోత...
ఆగస్టు 3 నుంచి ఆన్ లైన్లో విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇందుకు తగినట్లుగానే టీచర్లు ఇళ్ల వద్ద ఉంటూనే విద్యార్ధులకు ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఏడాది మే నెల రెండో వారం వరకూ విద్యా సంవత్సరం కొనసాగుతుంది. దసరా, సంక్రాంతి సెలవులను కూడా పరిమితం చేస్తారు. మొత్తంగా 180 రోజుల పని దినాలు ఉంటాయి. మధ్యలో సెలవులను కూడా తగ్గిస్తారు. సిలబస్ లోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. విద్యార్దుల స్కూల్ టైమ్, పని దినాలు తగ్గడంతో ఆ మేరకు వారిపై ఒత్తిడి లేకుండా సిలబస్ లోనూ 30 శాతం కోత విధిస్తారు. ఏయే పాఠ్యాంశాలు ఉండాలో ఇప్పటికే అధికారులు, అధ్యాపకులు, నిపుణులు కసరత్తు చేస్తున్నారు.
దూరదర్శన్, మన టీవీల్లో బోధన..
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం దూరదర్శన్ సప్తగిరి, మన టీవీ ఛానళ్లలో ప్రతీ రోజూ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయి. వాటిని విద్యార్ధులు ఫాలో కావాల్సి ఉంటుంది. మధ్యలో సందేహాలు వచ్చినప్పుడు టీచర్లను సంప్రదించేందుకు అన్ని ఆన్ లైన్ పద్దతులను అందుబాటులోకి తీసుకొస్తారు. మెసేజ్, వాట్సాప్ ద్వారా టీచర్లను సంప్రదించే అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్ధులకు బ్రిడ్జి కోర్సులను రోజుకు ఆరు గంటల పాటు ప్రసారం చేస్తున్నారు. వీటిని ఇకపైనా కొనసాగిస్తారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారా కూడా పాఠ్యాంశాల బోధన ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
Recommended Video
ఏప్రిల్, మేలో పరీక్షలు...
ప్రతీ ఏటా మార్చి నెలలో నిర్వహించే పదో తరగతి పరీక్షలను ఈసారి ఏప్రిల్ కు మారుస్తున్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలను మే నెలలో నిర్వహిస్తారు. మే రెండో వారం నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తారు. జూన్ 10 నుంచి యథావిదిగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించనున్నారు. దీనికి అనుగుణంగా అకనమిక్ క్యాలెండర్ నూ, సిలబస్ నూ త్వరలో పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. మరోవైపు కరోనా ప్రభావం తగ్గే వరకూ ఆన్ లైన్ విద్యాసంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నా... విద్యార్ధులు ఓ ఫార్మాట్ కు అలవాటు పడిన తర్వాత, ప్రస్తుత కరోనా పరిస్ధితుల్లో ఇప్పట్లో స్కూళ్లు ప్రారంభించే అవకాశాలు లేకపోవడంతో ఈసారికి పూర్తిగా ఆన్ లైన్ బోధనే ఉండొచ్చని తెలుస్తోంది.