ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ మరోసారి వాయిదా- సర్కారు పిల్లిమొగ్గలు - గాంధీ జయంతికి ప్లాన్..
ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నవరత్నాల అమలులో భాగంగా దాదాపు పాతిక లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఏ ముహుర్తాన తీసుకున్నారో కానీ అప్పటి నుంచీ వరుస వాయిదాల పర్వమే కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు రెవెన్యూ మంత్రి కమ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి.
మరోసారి వాయిదా పడిన ఇళ్లపట్టాలు..
ఏపీలో వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పటికే ఈ ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా ఓసారి, ఆ తర్వాత జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా మరోసారి, ఆగస్టు 15తో మరోసారి వాయిదా పడినట్లయింది. దీంతో ఇళ్ల పట్టాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న దాదాపు పాతిక లక్షల మంది పైగా పేదలకు నిరాశ తప్పడం లేదు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి న్యాయపరమైన చిక్కులతో పాటు ఇతరత్రా సమస్యలు కూడా అడ్డంకిగా నిలుస్తుండటంతో ముందుకు వెళ్లలేని పరిస్ధితి ఎదురవుతోంది.
గాంధీ జయంతికి ప్లాన్....
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవ్వాలని భావించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రకటించిన నేపథ్యంలో తదుపరి తేదీ ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 2న స్వరాజ్య చిహ్నమైన గాంధీ మహాత్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు జరగకపోతే దాదాపు ఈ ముహుర్తం ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
Recommended Video
వాయిదా వెనుక కారణాలివే...
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వరుస వాయిదాల వెనుక పలు కారణాలున్నాయి. ముందుగా ఉగాది ముహుర్తం అనుకున్న ఈ కార్యక్రమం కాస్తా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కరోనా ప్రభావం తగ్గకపోవడం వరుస వాయిదాలకు ప్రధాన కారణం. అలాగే అమరావతితో పాటు ఆవ భూముల్లో ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు సేకరించడంపై కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. వీటి విచారణ పలు దశల్లో ఉంది. దీంతోపాటు పలు ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీపై ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే గాంధీ జయంతి రోజున కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కష్టమేనన్న అంచనాలున్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాది జనవరి 26కు వాయిదా పడటం ఖాయమవుతుంది.