తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఏపీ- జీతభత్యాలు, పింఛన్లకూ డబ్బుల్లేవ్- రాజధానులు కట్టేదెలా ?
ఏపీలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక క్షిణించడం మొదలుపెట్టిన ఆర్ధిక పరిస్ధితిలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. అప్పట్లో జీతభత్యాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో సగం చెల్లింపులే చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు అదే పరిస్ధితుల్లో ఉంది. కాకపోతే ఆలస్యంగా చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. ఇవాళ ఆరో తేదీ వచ్చేసినా ఇంకా పెన్షనర్లకు వారి నెలవారీ పింఛన్ అందలేదు. గతంలో పెన్షనర్లకు కోతలు విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టాక వాటిని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. ఈసారి పింఛన్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్ధితి. అయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాల పందేరం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
మరింత బలపడ్డ కరోనా: పాత లెక్కలను తిరగరాసిన కొత్త కేసులు: 56 వేలకు పైగా
తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఏపీ...
ఏపీలో ఈ నెల ఒకట్రెండు తేదీల్లో ప్రభుత్వం వద్ద చెల్లింపులకు ఉన్న డబ్బు దాదాపు వెయ్యి కోట్లు కాగా... జీతభత్యాలకు అవసమైన మొత్తం రూ.5500 కోట్లు. దీంతో ప్రభుత్వం బాండ్లను తాకట్టు పెట్టి మరీ ఆలస్యంగా జీతాలు చెల్లిస్తోంది. పింఛన్ దారుల పరిస్ధితి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆరో తేదీ వచ్చేసినా వారికి ఇంకా నెలవారీ పింఛన్ అందనే లేదు. ఎల్లుండి కల్లా సమస్య పరిష్కారం అవుతుందన్న హామీలు మాత్రమే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రతీ నెలా ఉద్యోగుల జీతభత్యాలకు, పింఛన్లకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వానికి ఎవరూ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దాదాపు కాస్త అటు ఇటుగానే ఈ లెక్కలుంటాయి. కానీ ప్రభుత్వం మాత్రం నెల నెలా కొత్తగా సంక్షోభం తలెత్తినట్లుగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు డబ్బులు వెతుక్కోవడం విచిత్రంగా కనిపిస్తోంది.
ఉద్యోగుల కంటే సంక్షేమమే ప్రధానం
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమానంగా పరుగులు తీయిస్తామని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అయితే వీటి అమల్లో కీలకమైన ఉద్యోగుల జీతభత్యాలను పెండింగ్ లో పెట్టి వాటిని పరుగులు తీయించే దుస్సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే ప్రభుత్వ పాలన కానీ, పథకాల అమలు కానీ చేయాలంటే తిరిగి అదే ఉద్యోగులు తప్పనిసరి కాబట్టి. కానీ ఏపీలో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంటోంది. తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఉన్నా లెక్కచేయకుండా సంక్షేమ పథకాల వైపు ప్రభుత్వం తీస్తున్న పరుగులు చివరికి వాటిని అమలు చేయాల్సిన ఉద్యోగులపైనే ప్రభావం చూపుతున్నాయి. కొన్ని నెలలుగా ప్రభుత్వ రాబడి తగ్గిపోయందనని తెలిసినా లెక్క చేయకుండా ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఉద్యోగులు, పింఛన్ దారులకు శాపంగా మారుతున్నాయి.
పథకాల పందేరంతో ఎసరు..
గతేడాది అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఓటర్లకు ఎన్నో హామీలు గుప్పించింది. వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్నారు. ఉన్న వాటికి తోడు నెలకో కొత్త పథకం జాబితాలో వచ్చి చేరుతోంది. హామీ ఇచ్చిన పథకాలకు తోడు ఎప్పటికప్పుడు తోచిందే తడవుగా కొత్త పథకాలను కూడా ప్రకటించేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి తలకిందులవుతోంది. హామీ ఇవ్వని పథకాల ప్రకటన ఎందుకు అంటే ఏ ఒక్కరి వద్దా సమాధానం లేదు. ముఖ్యమంత్రికి వాస్తవాలు చెప్పే ధైర్యం అధికారులకు లేదు. దీంతో ఇదంతా ఓ ఫాల్స్ ప్రెస్టేజ్ వ్యవహారంగా మారిపోతోంది.
Recommended Video
రాజధానులు కట్టేదేలా ?
ఇప్పటికే నెలవారీ ఉద్యోగుల జీతభత్యాలకు, పింఛన్లకే డబ్బులు లేని పరిస్ధితుల్లో సంక్షేమ పథకాల రథం ఆగకుండా దూకుతున్న ప్రభుత్వం ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మరో గుదిబండను మీద వేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో అమరావతిని మినహాయిస్తే మిగిలిన రెండు ప్రాంతాల్లో రాజధానుల పేరుతో కాస్తో కూస్తో అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజధానులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు అమరావతి రాజధానికి నిధులిమ్మంటేనే రెండు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్రం... ఇప్పుడు మూడు రాజధానులకు సాయం చేయమంటే ఏమంటుందో అన్న భయాలు వైసీపీ ప్రభుత్వానికి లేకపోలేదు. అలా అని సొంత ఖజానా నుంచి నిధులు కేటాయించే పరిస్ధితి లేదు. అలాగని అమరావతి రాజధానికే కట్టుబడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రాజధానుల వ్యవహారం అసలే బక్కచిక్కిన ఖజానాపై తీవ్ర ప్రభావం చూపబోతోందని తెలుస్తోంది.