ఆంధ్రప్రదేశ్:భారీ బడ్జెట్ సరే!...నిధుల మాటేంటి..?
Recommended Video
ఒకవైపు తీవ్రమైన ఆర్థిక లోటు...మరేవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సాయానికి తిరస్కరణ...ఇలాంటి విపత్కర సమయంలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఘనంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. భారీ ఎత్తున నిధుల కేటాయింపులు, లెక్కలు, సంక్షేమ పథకాల ప్రకటనలు...అన్నీ చెప్పడానికి, వినడానికి బాగానే ఉన్నా ఆచరణ విషయమే ఆందోళన కలిగిస్తోంది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1, 91,63,000 కోట్లతో ఏపీ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ.28,678 కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు.
గత ఏడాది కంటే...ఎక్కువ...
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎపి బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు కాగా...ఈ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎపి ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. రూ.1,91,063 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్ 21.70 శాతం పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత భారీగా బడ్జెట్ను పెంచిన సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 1.37 వేల కోట్లు. ఈ ఏడాది ఆ లెక్కల్ని మరింత పెంచి రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలే కారణమని వేరేగా చెప్పనవసరం లేదు. అయితే రెవిన్యూ లోటు తీవ్రంగా ఉన్న తరుణంలో ఇలా బడ్జెట్ లెక్కలు భారీగా పెంచడంపై ఆర్థిక రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే...
వాస్తవ పరిస్థితులు...రెవిన్యూ లోటు...
ఎపి సర్కార్ వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాకుండా ఎన్నికల బడ్జెట్ గా దీన్ని తీర్చిదిద్దేందుకే అంకెల గారడీ చేసినట్లు కనిపిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితిని, రెవిన్యూ లోటుతో సతమతమవుతున్న విషయాన్ని బడ్జెట్ తయారీ సమయంలొ పక్కనబెట్టేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోందని అంటున్నారు. మూడు రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఎపి అసెంబ్లీ గవర్నర్ నరసింహన్ రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో ఎపి కష్టాలు మరింత పెరిగాయన్న సంగతి తెలిసిందే. మరి వాస్తవం అలా వుండగా భారీ బడ్జెట్ రూపకల్పన దేనికి నిదర్శనం?...
అప్పుల ఊబి...పరిమితి దాటి...కష్టాల కడలిలో ఎపి...
రాష్ట్ర విభజనతో ఎపి ఆదాయానికి భారీగా గండిపడిందనీ, ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఎపికి కేంద్రం నుంచి కనీస సహకారం అందక పోవడం రాష్ట్రంలో ఎంతటి సంక్షోభానికి దారితీసిందో కళ్లెదుటే కనిపిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత దేశవ్యాప్తంగా పరిస్థితులు మారిపోవడం, జిఎస్ టితో అంచనాలు తారుమారు కావడం అందరూ అనుభవిస్తున్నదే. ఇంకోపక్క రాష్ట్రం ఇప్పటికే లక్షా 32 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవడం గమనార్హం. మరోవైపుఇప్పటికే కేంద్రం విధించిన పరిమితిని దాటి అప్పులు చేసేసింది. మరి ఈ పరిస్థితులన్నీ బడ్జెట్ రూపకల్పన సమయంలో పరిగణనలోకి తీసుకున్నారా?...అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి లోటు ఎలా పూడుస్తారు?...ఇప్పుడదే చర్చనీయాంశం...
సంక్షేమ పథకాలకు కేటాయింపులు సరే...రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సాయం అందాల్సిందే. అయితే, ఈ పథకాల అమలు రాష్ట్ర ఖజానాకు గుది బండగా మారితే ప్రమాదమే కదా!...ఈ ఏడాది బడ్జెట్ లో సంక్షేమానికి భారీ కేటాయింపులు జరిపారు...అయితే దీన్ని ఆర్థిక నిపుణులు టిడిపి సాహసోపేత నిర్ణయంగానే విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇలా బడ్జెట్ కేటాయింపుల ప్రకారం అభివృద్ది పనుల చేపట్టాలంటే మళ్లీ అప్పులు చేయాల్సివుంటుంది. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయొచ్చు...కానీ...ఆ అప్పులు పరిమితి దాటి పోతే...రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం ఉంటుందనే విషయం వాస్తవం.
ఎపి...ఎలా అధిగమిస్తుంది?...
ఇంత ఆందోళన ఎందుకంటే 2020 తర్వాత కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రెవిన్యూలోటు రాష్ట్రంగా మిగులుతుందని 14వ ఆర్థికసంఘం చెప్పింది. కేంద్రం పన్నులవాటా పంచిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు అయిదేళ్లకాలానికి రూ.22,112 కోట్ల రెవిన్యూలోటు ఉంటుంది. ఇదే సమయంలో పన్నులవాటా పంచిన తర్వాత తెలంగాణ రెవిన్యూ మిగులు రూ.1,18,678 కోట్లకు చేరనుండటం గమనార్హం. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు...మరి వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే...కేవలం అంకెల గారడీని నమ్ముకుంటే దాన్నిఅమలులో ఆచరణలోకి ఎలా తీసుకువస్తారో వేచి చూడాల్సిందే.