కనీస ఆదాయం లేని ఆలయాల జాబితాను తెప్పించుకుంటోన్న జగన్ సర్కార్: ఏం చేయబోతోంది?
అమరావతి: రాష్ట్రంలో కనీస ఆదాయం లేని ఆలయాల స్థితిగతులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరా తీస్తోంది. జిల్లాలవారీగా అలాంటి ఆలయాల జాబితాను తెప్పించకుంటోంది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ కార్యదర్శి వీ ఉషారాణి రెండురోజుల కిందటే ఓ సర్కులర్ ను జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వచ్చేనెల 1వ తేదీలోగా జిల్లాలవారీగా కనీస ఆదాయం లేని ఆలయాల జాబితాను దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు.
ఎంపీపై సీఎం జగన్ సీరియస్... ఇంగ్లీష్ విద్యపై వార్నింగ్....!
మొత్తం 6709 ఆలయాలు..
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఎనిమిది వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. వాటిని 6 (ఎ), 6 (బీ), 6 (సీ)గా వర్గీకరించారు. వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉన్న సింహాచలం, విజయవాడ కనక దుర్గమ్మ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం వంటి ఆలయాలను 6 (ఎ) కేటగిరీలో ఉన్నాయి. వార్షిక ఆదాయం కోటి రూపాయల లోపు ఉండే దేవస్థానాలను 6 (బీ) లోకి తీసుకొచ్చింది దేవాదాయ శాఖ. ఏటా కనీసం 50 వేల ఆదాయ కూడా లేని చిన్న ఆలయాలను 6 (సీ)లో చేర్చింది. ప్రస్తుతం ఈ కేటగిరీలో 6709 ఆలయాలు ఉన్నాయి.
అర్చకుల వేతనాలను భారీగా పెంచడానికే..
అలాంటి కనీస ఆదాయం లేని ఆలయాల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తోన్న అర్చకులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి స్థితిగతులను ఆరా తీస్తోంది. ఆదాయమే లేని చిన్న గుళ్లల్లో పని చేసే అర్చకులు, సిబ్బంది జీతాలను భారీగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ జాబితాను ప్రభుత్వం తెప్పించుకుంటోందని దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న గుళ్లల్లో పనిచేసే అర్చకులు, సిబ్బంది వేతనాలను పెంచుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ధూప, దీప, నైవేద్యం పథకం బడ్జెట్ భారీగా పెంపు
కనీస ఆదాయం లేని ఆలయాల నిర్వహణ, అందులో పనిచేసే అర్చకులకు వేతనాలను ఇవ్వడానికి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద నామమాత్రంగా కూడా నిధులను కేటాయించలేదంటూ అర్చక సంఘాలు ఇదివరకే విమర్శలు గుప్పించారు. ధూప, దీప, నైవేద్యం పథకానికి నిధులను కేటాయించకపోవడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారాయంటూ అర్చకులు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
నాటి విజ్ఞప్తుల ఆధారంగా..
అప్పట్లో తన దృష్టికి వచ్చిన అర్చకుల వేతనాల సమస్యను వైఎస్ జగన్ నెరవేర్చనున్నారు. జిల్లాలవారీగా కనీస ఆదాయం లేని ఆలయాల జాబితాను తెప్పించుకోవడం, ఒక్కో ఆలయంలో ఎంతమంది అర్చకులు పని చేస్తున్నారు? అర్చకుల కుటుంబ సభ్యులు ఎంతమంది? ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయా? లేవా? ఆలయం ఏ స్థితిలో కొనసాగుతోంది. జీర్ణోద్ధరణ పనులు అవసరమా? వంటి అంశాలన్నింటినీ పొందుపరచాలని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే వార్షిక ఆదాయం సహా అన్ని వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.