ఏపీ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం- ఇంటిలిజెన్స్ హెచ్చరికలే కారణం..
ఏపీలో ప్రముఖుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇంటిలిజెన్స్ విభాగం తాజాగా ఇచ్చిన నివేదిక చర్చనీయాంశమైంది. ఈ నివేదికలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు భద్రతకు ముప్పుందని హెచ్చరించింది. దీంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిచాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపింది.
తాజా నిఘా నివేదికల ప్రకారం కన్నబాబు భద్రతకు ప్రమాదం ఉందని అధికారులు పది రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయనకు ప్రభుత్వం తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపింది. ఈ వాహనంలోనే అధికారిక పర్యటనలు, ప్రయాణాలు చేయాలని ఇంటిలిజెన్స్ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఈ వాహనంలోనే పర్యటనలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కన్నబాబు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్లో ప్రస్తుతం ఆయన కీలక మంత్రిగా ఉన్నారు. వ్యవసాయశాఖతో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఊన్నారు. దీంతో విశాఖ పర్యటనలో ఆయన్ను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ భద్రత ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video
గతేడాది వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత పలువురు విపక్ష నేతల భద్రతను కుదించారు. మరికొందరికి పూర్తిగా తొలగించారు. అలాగని ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు అసాధారణ భద్రతేమీ కల్పించలేదు. సీనియర్ మంత్రులు సైతం సాధారణ సెక్యూరిటీతోనే ప్రస్తుతం పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా నివేదికల ఆధారంగా ప్రభుత్వం కన్నబాబుకు భద్రత ఇచ్చింది.