రాజధాని రద్దుకు సర్కార్ రెడీ.. మూడు రాజధానులు , యూపీ మోడల్ లో నాలుగు జోన్లుగా ఏపీ !!
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడకు నేటితో తెర పడనుందా ? మొత్తానికి సీఎం జగన్ అనుకున్నదే చెయ్యబోతున్నారా ?నేటి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాజధాని రద్దు కాబోతుందా? వికేంద్రీకరణ దిశగా మొగ్గు చూపుతున్న జగన్ మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు ఏపీని నాలుగు జోన్లుగా విభజించనున్నారా ?అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి.
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..
వికేంద్రీకరణ దిశగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో రాజధాని రద్దు కాబోతోంది. రాజధాని కేంద్రంగా జరగాల్సిన పరిపాలనను పూర్తిగా వికేంద్రీకరించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజలకు రాజధానితో ఎలాంటి సంబంధం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు విపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇక నిన్నటి వరకు మూడు రాజధానులు అని అంతా భావిస్తే ఇప్పుడు దానికి అనుసంధానంగా కొత్త ప్రతిపాదన నాలుగు జోన్లు తెర మీదకు వచ్చింది.
యూపీ తరహాలో జోనల్ వ్యవస్థకు శ్రీకారం
ఉత్తరప్రదేశ్లోని డివిజన్ల తరహాలో ఆంధ్రప్రదేశ్ ను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని యోచిస్తున్నారని సమాచారం . నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి ప్రతి జోన్లో ప్రతి కీలక శాఖకు చెందిన ఒక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టినట్లు తెలుస్తుంది. సచివాలయంతో సంబంధమున్న విధానపరమైన నిర్ణయాలు కాకుండా ప్రజా వినతులు, సమస్యలు, ఉద్యోగుల కోర్కెలు తదితరాలన్నీ కమిషనరేట్లలోనే పరిష్కారమయ్యేలా కసరత్తు చేస్తున్నారు .
నాలుగు జోనల్ కమీషనరేట్ల ఏర్పాటు
ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం . ఇందులో 75 జిల్లాలు ఉన్నాయి. పాలనాసౌలభ్యం కోసం వీటన్నిటినీ 18 డివిజన్లుగా విభజించి డివిజనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. ఇక సీఎం జగన్ కూడా ఇదే మోడల్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం . జోనల్ వ్యవస్థపై సోమవారం ఉదయం జరిగే మంత్రివర్గ భేటీలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడిస్తుందని తెలుస్తుంది . నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి జోనల్ స్థాయిలో అన్ని సమస్యలు పరిస్కరిస్తే ప్రజలకు రాజధానితో ప్రమేయమే ఉండదని భావిస్తోంది ఏపీ సర్కార్ . ఈ మేరకు నేడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలుస్తుంది .
మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించకుండా జోన్ల ఏర్పాటు
నాలుగు జోన్లుగా విభజించి జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు . మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజలు వ్యతిరేకించకుండా , ప్రజలసమస్యలు తదితరాల పరిష్కరణకు నాలుగు జోన్లుగా ఏర్పాటు చేసి జోనల్ వ్యవస్థ తీసుకువస్తే ప్రజలకు రాజధాని అంశం అప్పుడు అంత ప్రదానతాంశం కాదని సర్కార్ భావిస్తుంది. నిన్నటి దాకా రాయలసీమ ప్రజలు వైజాగ్ వెళ్ళాలంటే చాలా దూరం, చాలా ఇబ్బంది అని రాజధానిగా వైజాగ్ ను వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో రాయలసీమను జోన్ గా ఏర్పాటు చేసి పాలన అందుబాటులో ఉంటుందని చెప్పనున్నారు.
నేడు అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం
మొత్తానికి సీఎం జగన్ రాజధానిని ఒక్క చోటే కేంద్రీకృతం చెయ్యకుండా అమరావతిలో అసెంబ్లీ (వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే), హైకోర్టు బెంచ్ ఏర్పాటు, విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇక కర్నూలులో హైకోర్టు, న్యాయ పరిధిలోని సంస్థలన్నీ ఏర్పాటు చేసి పాలనా వికేంద్రీకరణ చేయ్యనున్నారని సమాచారం . అందుకు అనుబంధంగా ఏపీని నాలుగు జోన్లుగా ఏర్పాటు చేసి జోనల్ వ్యవస్థను రూపొందించనున్నారు. నేడు అందుకు అసెంబ్లీ సమావేశాలలో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.