సోనూసూద్ నుంచి ట్రాక్టర్ తీసుకున్న రైతు - 8 ప్రభుత్వ పథకాల లబ్దిదారు... సర్కార్ వెల్లడి..
సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి దుక్కి దున్నుతూ వీడియో తీసుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మహల్ రాజు పల్లె రైతు నాగేశ్వరావు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. ప్రభుత్వ పథకాల లబ్దిని కించపరిచేలా ఈ వీడియోను విపక్షాలు వాడుకునేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహంగా ఉన్న సర్కారు.. ఇప్పటికే రైతుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ నుంచి తీసుకున్న ట్రాక్టర్ ను ఇచ్చేయాలని సూచించింది.
అదే సమయంలో రైతు నాగేశ్వరావు కుటుంబ పరిస్ధితిపై ఆరా తీసిన అధికారులకు షాకింగ్ వాస్తవాలు పలకరించాయి. రైతు కుటుంబం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ప్రభుత్వ పథకాల లబ్దిదారుగా తేలింది. గతేడాది రైతు భరోసా కింద నాగేశ్వరరావు ఖాతాలో ప్రభుత్వం రూ.13,500 నగదు జమచేసింది. ఈ ఏడాది రైతు భరోసాలోనూ ఇప్పటివరకూ రూ.7500 బదిలీ అయ్యాయి. అక్టోబర్, జనవరిలో మరో 6000 జమ కావాల్సి ఉంది.
నాగేశ్వరరావు చిన్న కూతురికి జగనన్న అమ్మఒడి కింద గత జనవరిలో రూ.15 వేలు అందాయి. అలాగే పెద్దకూతురికి కూడా జగనన్న తోడు కింద దరఖాస్తు చేసుకున్నారు. చిరువ్యాపారులకు వడ్డీలేని ఆర్ధిక సాయం కోసం ఈ రుణం మంజూరు కావాల్సి ఉంది. నాగేశ్వరరావు తల్లి అభయహస్తం పథకం కింద పెన్షన్ తీసుకుంటున్నారు. తండ్రి కూడా వృద్ధాప్య పింఛన్ కింద రూ.2250 అందుకుంటున్నారు.
అంతే కాదు కరోనా సాయం కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలతో పాటు ఉచిత రేషన్ కూడా ఈ కుటుంబానికి అందాయి. తనకున్న రెండెకరాల పొలంలో వేరుశెనగ పంట వేయడానికి నాగేశ్వరరావు రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు కూడా తీసుకున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. అంటే ప్రభుత్వ పథకాలన్నీ పొందుతూ కూడా తనకు దుక్కి దున్నేందుకు ఎడ్లు, ట్రాక్టర్ కూడా లేదని చెప్పుకునేందుకు రైతు నాగేశ్వరరావు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.