ఏపీలో విమానం ఎక్కాలంటే సవాలక్ష ఆంక్షలు: టికెట్లను నేరుగా కొనలేం: అక్కడి నుంచి ఎవరొచ్చినా
అమరావతి: దేశవ్యాప్తంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులు, విమానాశ్రయాల నిర్వహణ, వాటి కార్యకలాపాలపై కొత్తగా కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. దీనికోసం రాత్రికి రాత్రి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణికులను వడపోసేలా ఈ మార్గదర్శకాలను జారీ రూపొందించింది ఏపీ సర్కార్. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
Recommended Video
చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు: డీజీపీ అనుమతి ఇచ్చినా: జగన్ కుట్ర: భగ్గుమంటోన్న టీడీపీ
ఏపీలో ఆలస్యంగా..
దేశవ్యాప్తంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారమే ప్రారంభమైనప్పటికీ.. ఏపీ, పశ్చిమ బెంగాల్లల్లో ఆలస్యం కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి దేశీయ విమానాల్లో ఎగరబోతున్నాయి. మార్గదర్శకాల జారీలో జాప్యం చోటు చేసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తొలుత మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ.. చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులను చేయాల్సి వచ్చిందని, అందుకే ఒకరోజు పాటు ఏపీలో విమాన సర్వీసులను వాయిదా వేయాల్సి వచ్చిందని అంటున్నారు.
స్పందన ద్వారా
రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికులు నేరుగా టికెట్లను కొనలేరు. ఆన్లైన్ ద్వారా, బుకింగ్ ఏజెంట్ల ద్వారా టికెట్లను తీసుకోవడంపై ప్రభుత్వం ఆంక్షలను విధించింది. విమాన టికెట్ తీసుకోదలిచిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా స్పందన వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. స్పందన వెబ్సైట్ నుంచి క్లియరెన్స్ ఉంటేనే విమానయాన సంస్థలు సదరు ప్రయాణికుడికి టికెట్లను జారీ చేస్తాయి.
పూర్తి వివరాలు ఇస్తేనే..
స్పందన వెబ్సైట్లో పేరును నమోదు చేసుకోవాలంటే.. పూర్తి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామం పేరు, వార్డు నంబర్, ఇంతకుముందు ఉన్న ట్రావెల్ హిస్టరీ.. ప్రయాణికుడి నివాసం ఏ ప్రాంతంలో ఉంది? రెడ్జోన్ పరిధిలో ఉందా? కంటైన్మెంట్ కిందికి వస్తుందా? అనే వివరాలన్నింటినీ స్పందన వెబ్సైట్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ స్పందన వెబ్సైట్ క్రోడీకరిస్తుంది. ఈ వెబ్సైట్ క్లియరెన్స్ ఇస్తే తప్ప.. విమానయాన సంస్థలు టికెట్లను జారీ చేయవు.
ఆరు రాష్ట్రాలపై నిఘా
చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల నుంచి ఏపీకి రావాలనుకునే వారు క్వారంటైన్కు సిద్ధపడాల్సి ఉంటుంది. ఏడురోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి రావడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మరో ఏడురోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ల నుంచి ఎవరు వచ్చినా.. క్వారంటైన్ తప్పనిసరి. మిగిలిన రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చినా కొన్ని ఆంక్షలు తప్పకపోవచ్చు.
స్వాబ్ సేకరణ తప్పనిసరి..
విమానం దిగే ప్రతి ప్రయాణికుడి నుంచి సిబ్బంది స్వాబ్ను సేకరిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాల్లో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. స్వాబ్ను పరీక్షల కోసం లాబొరేటరీకి పంపిస్తారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే.. వారిని ఐసొలేషన్ వార్డుకు తరలిస్తారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. ఇవన్నీ కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల్లో పొందుపరిచింది ప్రభుత్వం.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యాయని, ఆ పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంలో భాగంగా కొత్త మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు.