ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం విడుదల- మూడు రాజధానుల అభివృద్ధికి బాటలు వేసేలా...
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ఊపందుకున్న వేళ కొత్తగా ఏర్పాటయ్యే రాజధానులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలే వేసేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. రాబోయే నాలుగేళ్లలో ప్రజలు, పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యంతో పరిశ్రమల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం గత విధానంలో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కుంటుపడిన పరిశ్రమలను ఆదుకునేలా ఇందులో పలు చర్యలు ప్రకటించారు. సమాజంలో మహిళలతో పాటు అణగారిన వర్గాలకు పలు రాయితీలు కూడా ఇందులో ఉన్నాయి.
Recommended Video
ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం...
ఏపీలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో దీన్ని విడుదల చేశారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం రూపొందించినట్లు మంత్రి గౌతంరెడ్డి ప్రకటించారు. తాజా విధానం ప్రకారం చూస్తే రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి అవసరమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నట్లు అర్ధమవుతోంది. అదే సమయంలో కరోనా కారణంగా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా పలు స్పష్టమైన చర్యలు కూడా ఇందులో ఉన్నాయి.
కొత్త విధానం ఆవశ్యకత..
వచ్చే నాలుగేళ్ల కాలానికి ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం వెనుక ఆవశ్యకతను ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడం, ప్రాంతాల మధ్య సమతుల్యం, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నైపుణ్యాల వృద్ధి, అత్యంత తక్కువ సమయంలో పెట్టుబడుల ఆకర్షణకు హామీ ఇవ్వడం ఆవశ్యకం కావడంతో కొత్త విధానం తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే తక్కువ సమయంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ అత్యవసరమని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది.
పారిశ్రామిక విధానం లక్ష్యాలివే..
కొత్త పారిశ్రామిక విధానం అమలు ద్వారా అందుకోవాల్సిన లక్ష్యాలను సైతం ప్రభుత్వం విధాన పత్రంలో పేర్కొంది. వీటి ప్రకారం రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పన, పరిశ్రమల తలసరి ఆదాయం జాతీయ సగటుకు చేరుకునేలా చేయడం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, కులాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి సమతుల్యం చేయడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధించడం వంటి అంశాలున్నాయి. వీటిని సాధించేందుకు నాలుగేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక సౌకర్యాల వృద్ధి, పారిశ్రామిక జోన్ల అభివృద్ధి, యువతలో నైపుణ్యాల వృద్ధి, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రోత్సాహకాలు, పారిశ్రామికవేత్తలకు నిరంతరం సాయం అందించడం ద్వారా ఈ లక్ష్యాలు అందుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
పారిశ్రామిక రాయితీల కల్పన..
ప్రజలను, పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తూ రూపొందిన సరికొత్త పారిశ్రామిక విధానంలో సమాజంలో అణగారిన వర్గాలతో పాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని నిర్ణయించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ)లకు పెద్ద ఎత్తున సాయం అందించనున్నారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఇందులో పొందుపరిచారు.
ప్రాధాన్య రంగాలివే...
కొత్త పారిశ్రామిక విధానం ఫలాలు నాలుగేళ్లలో అందాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం అందుకోసం కొన్ని ప్రాధాన్యతా రంగాలను కూడా ప్రకటించింది. ఇందులో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాలలో పెట్టుబడులకు ప్రాధాన్యతఇవ్వనున్నారు. అలాగే మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకనుగుణంగా అదనపు రాయితీలుకల్పిస్తారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉపాధి కల్పించే పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతుల మంజూరు, భూముల కేటాయింపు, ఇతర చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ ఛేంజ్ ల సమ్మిళితంఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.