ఏపీలో డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్-10 నెలల అప్రెంటిస్ తప్పనిసరి-తాజా మార్పులివే...
ఏపీలో నిరుద్యోగితను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా డిగ్రీ కోర్సులను ఉద్యోగ ఆథారితంగా తీర్చిదిద్దారు. పది నెలల అప్రెంటీస్ ను తప్పనిసరి చేయడంతో పాటు సిలబస్ లోనూ పలు మార్పులు చేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నతవిద్యామండలి రూపొందించిన సిలబస్ ను విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా విడుదల చేశారు.
Recommended Video
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!
ఉద్యోగిత పెంపే లక్ష్యం....
గతంలో చదివే చదువుకూ ఉద్యోగానికి సంబంధం లేకుండా పోవడంతో డిగ్రీలు పూర్తి చేసి కూడా యువత నిరుద్యోగుల్లా మిగిలిపోవాల్సిన పరిస్ధితి ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్ధితిని మార్చేందుకు యూజీసీతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఉద్యోగ ఆథారితంగా మార్చేందుకు వీలుగా భారీ మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగా సిలబస్ మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్ షిప్ ను కూడా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక డిగ్రీ సవ్యంగా పూర్తి చేసే ఏదో రకంగా ఉద్యోగం లభించినట్లే అన్న ధీమా కల్పించేలా ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
తప్పనిసరి అప్రెంటిస్షిప్...
గతంలో సాంకేతిక విద్యా కోర్సుల్లో మాత్రమే కనిపించే అప్రెంటీస్ విధానాన్ని ఇకపై డిగ్రీ కోర్సులకు కూడా అనుసంధానిస్తున్నారు. అంతే కాదు మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్ షిప్ ను తప్పనిసరి చేశారు. విద్యార్ధులకు తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ అనుభవాన్ని కూడా ఇవ్వాలన్న యూజీసీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పది నెలల అప్రెంటిస్ షిప్ డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం కోర్సుల్లో వేసవి సెలవుల్లో భాగంగా రెండేసి నెలల పాటు మొత్తం నాలుగు నెలలు ఉంటుంది. ఆ తర్వాత మూడో ఏడాది మిగిలిన ఆరు నెలలను కవర్ చేస్తారు.
జాబ్ స్కిల్స్ కూ పెద్దపీట..
ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల స్వభావం పూర్తిగా మారిపోనుంది. ఫలితాల ఆధారంగానే సిలబస్ ను రూపొందించారు. ఫౌండేషన్ కోర్సుల స్ధానంలో లైఫ్ స్కిల్స్ వచ్చి చేరాయి. సెమిస్టర్ కు ఓ కోర్సు చొప్పున మూడు స్కిల్ కోర్సులు ఎంపిక చేసుకోవాలి. నాలుగో సెమిస్టర్ లో మాత్రం పర్యావరణ విద్యను తప్పనిసరి చేశారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను కూడా సిద్ధం చేశారు. వీటిలో నాలుగు కోర్సులను మొదటి మూడు సెమిస్టర్లలో ఎంపిక చేసుకోవాలి. నాలుగో సెమిస్టర్లో రెండు కోర్సులు, చివరి ఏడాది ఐదో సెమిస్టర్ లో జాబ్ స్కిల్స్ కు సంబంధించి ఆరు కోర్సులు ఉంటాయి. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఇక జాబ్ లభించడం సులువే.
సమాజంతో కాలేజీల అనుసంధానం...
ఇప్పటివరకూ సమాజంలో భాగంగానే విద్యావ్యవస్ధ ఉన్నప్పటికీ అనుసంధానం మాత్రం కుదరలేదు. దీనికి కారణం అప్పటి విద్యావిధానాలే. తాజా మార్పులతో ఇక విద్యావ్యవస్ధలో భాగంగా ఉన్న కళాశాలల్లో విద్యార్ధులంతా ఏదో రకంగా సమాజంతో అనుసంధానమై అక్కడ ఏం జరుగుతుందన్న అంశాన్ని తప్పనిసరిగా అభ్యసించాల్సిందే. ఇందుకోసం ఇంటర్న్ షిప్ లో కమ్యూనిటీ సేవల ప్రాజెక్టును తప్పనిసరి చేశారు. మొదటి ఏడాది డిగ్రీ కోర్సు పూర్తి కాగానే విద్యార్ధులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాల్సిందే. తద్వారా సమాజంలో ఏం జరుగుతోంది. వాటికి అనుగుణంగా మన చదువు ఉందా లేదా అనే విషయం విద్యార్ధులు పరీక్షించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆన్ లైన్ కోర్సులు చేసే వారికి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీజీల్లో పాల్గొనే వారికి అదనపు క్రెడిట్స్ కూడా ఇచ్చేలా మార్పులు చేశారు.